గ్రామానికి కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్ శర్మ ఇంట్లో ప్రతీ గురువారం సా యిబాబా భజన కార్యక్రమం నిర్వహించేవారు. ఇందులో భాగంగానే 1985లో తొలిసారిగా నర్సింహులపేట మండలకేంద్రంలోని బొల్లం గౌరయ్య ఇంటి ముందు అప్పాల వెంకన్న, జంపాల యాదగిరి, కొండబత్తిని జగదీశ్వర్, మండలం రవి, మొగులగాని యాదగిరితో కలిసి మట్టి వినాయకుడి విగ్రహం చేసి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులు దాసరోజు దక్షిణామూర్తి ఇంట్లో ప్రతిష్ఠించేవారు. చందాలు వేసుకొని వచ్చిన డబ్బులతో తెనాలి, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి హరికథలు, బుర్రకథలు, నాటకాలు వేసేవారిని తీసుకొచ్చేవారు. ఇదే కొనసాగింపుగా నర్సింహులపేట చౌరస్తాలో అప్పటి నుంచి ఇప్పటివరకు వినాయక ఉత్సవాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఊరేగింపులో పెట్రమాక్స్లైట్లు పెట్టి ఊరేగించేవారు. ఇప్పుడు కాలం మారింది. డీజేలు, హైమాస్ట్ లైట్లతో ఆర్భాటంగా ఉత్సవాలు చేయాల్సి వస్తుందని భక్త బృందం సభ్యులు బొల్లం మోహన్రావు, జగదీశ్వర్, యాదగిరి చెబుతున్నారు.


