మహబూబాబాద్ రూరల్: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం అందించడంలో జిల్లా పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)కు సంబంధించిన ఎంఆర్ఎం పోర్టల్ అమలులో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు జిల్లా పోలీసులకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం లభించింది.
ఎంఆర్ఎంతో బాధితులకు సహకారం..
ప్రత్యేకంగా మనీ రీస్టోరేషన్ మాడ్యుల్ (ఎంఆర్ఎం) ద్వారా సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన నగదును గుర్తించి, ఫ్రిజ్ చేయించి, నిబంధనల ప్రకారం బాధితులకు తిరిగి అందించడంలో జిల్లా సైబర్ క్రైమ్ విభాగం విశేష ప్రతిభ కనబరిచింది. సైబర్ ఫిర్యాదులపై వేగవంతమైన స్పందన, బ్యాంకులతో సమన్వయం, మోసపోయిన నగదును గుర్తించడం (ట్రేస్ చేయడం), సమయానుకూలంగా చర్యలు చేపట్టడం వంటి అంశాల్లో జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేశారు.
డీజీపీ నుంచి అవార్డు స్వీకరణ..
జిల్లా పోలీసుల ప్రతిభకు అవార్డు వరించింది. హైదరాబాద్ పంజగుట్టలోని టీజీఐసీసీలో నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా జిల్లా పోలీసుల తరఫున తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్ అవార్డు అందుకున్నారు.
ఫిర్యాదు చేస్తే నగదు పొందే అవకాశం..
సైబర్ నేరాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలి. త్వరగా ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును ఫ్రిజ్ చేసి తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయి.
సమన్వయంతో ప్రథమ స్థానం
సైబర్ నేరాలపై నిరంతర పర్యవేక్షణ, బాధితులకు అండగా నిలవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం, బ్యాంకింగ్ సంస్థలతో సమన్వయంతో పనిచేయడం ద్వారా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణం. తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్తో పాటు మొత్తం సైబర్ క్రైమ్ బృందానికి ప్రత్యేక అభినందనలు. – డాక్టర్ శబరీష్, ఎస్పీ
●
ఎంఆర్ఎం పోర్టల్ అమలులో అత్యుత్తమ పనితీరు
రాష్ట్రస్థాయిలో జిల్లా పోలీసులకు ప్రథమ స్థానం


