మహబూబాబాద్ రూరల్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై బీజేపీ నాయకులు అవమానకరంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీలో మల్లికార్జున ఖర్గేపై జరిగిన వివక్షపూరిత, అవమానకర చర్యను నిరసిస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి, సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమ మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, బీజేపీ నాయకులు తమ వైఖరిని మార్చుకుని ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గూగులోత్ జ్యోతిరమేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బెల్లంకొండ శ్రీనివాస్, చిలువేరు సమ్మిగౌడ్, బాలాజీనాయక్, కౌన్సిలర్లు ధనలక్ష్మి, పార్వతి, మాధవి, అరుణ, దిలీప్, రాజు, సర్పంచులు రేణుక, నిర్మల, రెహనాఫర్వీన్, డీవైసీ అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్, నాయకులు ప్రసాద్ నాయక్, వీరన్న, రమేష్, గిరిధర్ గుప్తా, ప్రవీణ్ కుమార్, శ్రీను, వెంకటి, పద్మజ, పద్మబాయి, సత్యమనోరమ, ఖలీల్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున ఖర్గేకు జరిగిన
అవమానంపై కాంగ్రెస్ నిరసన


