కేసముద్రం మండలం తాళ్లపూసపెల్లి గ్రామానికి చెందిన రైతు సొల్లేటి జైపాల్ రెడ్డి.. గత కొన్ని సంవత్సరాలుగా తనకున్న 40 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో పలు పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎల్ఓఎఫ్ఎం (లిక్విడ్ ఆర్గానిక్ ఫార్మేటెడ్ మైన్యూర్) బయో ఎరువును తయారుచేసి పంటలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం 15 ఎకరాల్లో వరి, 10 ఎకరాల్లో ఆయిల్ ఫామ్, 10 ఎకరాల్లో మామిడి, ఐదు ఎకరాల్లో పెసర, కందులు, మినుములు, నువ్వులు, వేరుశనగ, మిర్చి పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. లోక్ గ్లైసమిక్ ఇండెక్స్ వరి విత్తనాన్ని సాగు చేస్తూ, ఎకరానికి 18–20 క్వింటాల దిగుబడి సాధిస్తున్నాడు. పంట ఉత్పత్తులను పలు ప్రాంతాల నుండి వచ్చిన రైతులతో పాటు పలువురు నేరుగా గ్రామానికి వచ్చి కొనుగోలు చేస్తారని జైపాల్ రెడ్డి తెలుపుతున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతిలో లభించే బయో ఎరువులను ఉపయోగిస్తూ పండించిన ఆర్గానిక్ పంట ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ బాగుంటుందని జైపాల్రెడ్డి చెబుతున్నాడు.


