కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి బ్రహ్మంగారితండాలో అద్దెభవనంలో ప్రాథమిక పాఠశాలను డీఈఓ సత్యనారాయణమూర్తి బుధవారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలకు పక్కాభవనం లేక, ఇన్నేళ్లుగా రేకుల షెడ్డు కింద విద్యార్థులు చదువుతూ ఇబ్బందులు పడ్డారన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం అద్దెభవనంలో పాఠశాలను ప్రారంభించామని, ప్రతీ నెల అద్దెను జిల్లా విద్యాశాఖ చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ కాలేరు యాదగిరి, కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రశేఖర్, డీఎస్ఓ అప్పారావు, ఏఎంఓ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు శ్రీశైలం, సంతోష్ పాల్గొన్నారు.
పాఠశాలల్లో మొక్కలు నాటాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పనిసరిగా మొక్కలు నాటాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధి ఈదులపూసపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం వన మహోత్సవం నిర్వహించగా.. డీఈఓ సత్యనారాయణమూర్తి హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణ, ఖాళీ ప్రదేశాలతో పాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్లు, పాఠశాలల హెచ్ఎంలు వెంకటేశ్వర్లు, వీరయ్య, కౌన్సిలర్ స్పందన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


