మహబూబాబాద్ రూరల్: ధూప దీప నైవేద్య పథకం పరిధిలో పనిచేస్తున్న అర్చకులకు ఈ నెల 1వ తేదీన వేతనాలు విడుదలకావడం శుభపరిణామమని డీడీఎన్ గౌరవ అధ్యక్షుడు కృష్ణమాచార్యులు, గౌరవ సలహాదారు లక్ష్మీనరసింహాచార్యులు, జిల్లా అధ్యక్షుడు చక్రధరాచార్యులు అన్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ ధూప దీప నైవేద్య అర్చకుల బాధలను గుర్తించి ప్రభుత్వం ఒకటవ తేదీన వేతనాలు విడుదల చేయడం శుభపరిణామామన్నారు. డీడీఎన్ పరిధిలోని దేవాలయాలను గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ గుర్తింపు ఇచ్చి దేవాదాయ శాఖలో విలీనం చేసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వేతనాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావుకు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంకటేశ్వరాచార్యులు, వేణుగోపాల్, రమణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాలు శిశువుకు శ్రేష్టమైనవి
గార్ల: నవజాత శిశువులకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని జిల్లా సంక్షేమ అధికారిణి కే.శిరీష అన్నారు. మండలంలోని గోపాలపురం సెక్టార్ పరిధిలోని బాలాజీతండాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమమైన పౌష్టికాహారం తల్లిపాల నుంచే లభిస్తుందని, తల్లిపాలు ఇవ్వడంతో పిల్లలకు, తల్లికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. తల్లిపాల ఆవశ్యకత, ముర్రుపాల ప్రాముఖ్యతను బాలింతలు, గర్భిణులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మి, సర్పంచ్ భట్టు అనిత నాగరాజు, ఉపసర్పంచ్ బాలు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, సూపర్వైజర్ సంపూర్ణ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ..
మహబూబాబాద్: తల్లిపాలు అమృతంతో సమానమని ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష అన్నారు. జిల్లా కేంద్రంలోని సంక్షేమాధికారి కార్యాలయంలో మంగళవారం ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలపై రూపొందించిన పోస్టర్లను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ చైతన్య, బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ రమేశ్, సంస్థ ప్రతినిధులు వీరన్న, సహజ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వీరభద్రస్వామి హుండీ ఆదాయం రూ.53.97లక్షలు
కురవి: మండలకేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయ హుండీల ఆదాయం రూ.53,97,671 సమకూరినట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ, ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి తెలిపారు. మార్చి 25వ తేదీ నుంచి ఈనెల 3వ తేదీ వరకు స్వామి, అమ్మవారికి సంబంధించిన 17 హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకలను మంగళవారం లెక్కించినట్లు తెలిపారు. వీరభద్రస్వామి హుండీ ద్వారా రూ.40,53,701, భద్రకాళీ అమ్మవారి హుండీ ద్వారా రూ.13,43,970 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే యూఎస్ఏ డాలర్స్ 101, నేపాల్ రూపీ 40, సింగపూర్ డాలర్స్ 4, ఇరాక్ దినార్స్ 10 వేలు, ఇంగ్లాండ్ పౌండ్స్ 10 వచ్చినట్లు తెలిపారు. హుండీల్లో వచ్చిన మిశ్రమ వెండి, బంగారం సంచిలో తేదీ రాసి తిరిగి హుండీలో వేయడం జరిగిందన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ ధర్మదాయ శాఖ మహబూబాబాద్ ఇన్స్పెక్టర్ సంజీవరెడ్డి, ఆలయ ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, దొంగల జనార్దన్రెడ్డి, గడీల భిక్షపతి, గుగులోత్ సోమ్లా, శ్రీ లక్ష్మీ శ్రీనివాసా సేవా ట్రస్ట్, శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సేవా ట్రస్ట్, శ్రీ అనంతాద్రి సేవా ట్రస్టు సభ్యులు, శ్రీ దుర్గ శివసాయిసేవా ట్రస్టు సభ్యులు హుండీలను లెక్కించారు.


