సాక్షిప్రతినిధి, వరంగల్: కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ (శక్తి) శాఖలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)ని ఏర్పాటు చేస్తూ జీఓఆర్టీ నంబర్ 277ను మంగళవారం జారీ చేసింది. దీంతో ఈ శాఖ పరిధిలో పనిచేసే మహిళా ఉద్యోగులు కార్యాలయంలో ఎదురయ్యే లైంగిక వేధింపులపై అధికారికంగా ఫిర్యాదు చేసి, విచారణ కోరే అవకాశం కలిగింది.
నలుగురితో ఐసీసీ..
ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ టు ఎంజీ మాధవి ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. సెక్షన్ ఆఫీసర్ యు.గాయత్రీదేవి, ఏఎస్ఓ ఎస్.రజితారెడ్డి, ఏఎస్ఓ ఎ.జయశ్రీ సభ్యులుగా నియమితులయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడినుంచైనా మహిళా ఉద్యోగులనుంచి వచ్చే లైంగిక వేధింపుల ఫిర్యాదులను కమిటీ స్వీకరించి, విచారణ జరిపి సమగ్ర నివేదికను రూపొందించనుంది. అనంతరం ఆ నివేదికను ప్రభుత్వ కార్యదర్శికి సమర్పిస్తుంది. విచారణ నివేదిక ఆధారంగా అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం అవసరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుంటుంది.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో..
ఉమ్మడి వరంగల్లోనూ ప్రాధాన్యం..
కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నిషేధం, ఫిర్యాదుల పరిష్కారానికి ఉద్దేశించిన 2013 నాటి ‘పోష్’ చట్టం ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 2023 మే 12న సివిల్ అప్పీల్ నంబర్ 2482/2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో భాగంగా రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగులు, వద్ధుల సంక్షేమ శాఖ అన్ని సచివాలయశాఖల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ మేరకు శక్తి శాఖ తాజాగా ఐసీసీని ఏర్పాటు చేసింది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రభుత్వ శాఖల పరిధిలో పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి ఆయా కార్యాలయాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండనుంది. ఫిర్యాదులను నిబంధనల ప్రకారం స్వీకరించి విచారణ చేపట్టేందుకు ఈ కమిటీకి బాధ్యతలు అప్పగించారు.
నలుగురు సభ్యులతో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు
లైంగిక వేధింపులుంటే విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఉమ్మడి వరంగల్లోనూ పటిష్టంగా అమలు


