స్వాతంత్య్ర మాసాన్ని పురస్కరించుకుని సైబర్ మోసాలపై పోలీస్శాఖ అవగాహన
సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన
జాతీయ సైబర్ జాగృక్తా దివస్ సందర్భంగా నేటి నుంచి ఆగస్టు మాసం చివరి వరకు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, గ్రామ పంచాయతీలు, సాధారణ ప్రజల భాగస్వామ్యంతో సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేయాలి.
– ఎస్పీ డాక్టర్ శబరీష్
● నేడు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఎస్పీ
మహబూబాబాద్ రూరల్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో స్వాతంత్య్ర మాసాన్ని పురస్కరించుకుని ‘సురక్ష కా తిరంగా సైబర్ స్వాతంత్య్ర తెలంగాణ’ ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సైబర్ మోసాలపై ప్రచార కార్యక్రమాన్ని మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నేడు (బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు.
విస్తృత స్థాయిలో అవగాహన..
ఆగస్టు నెల మొత్తం జిల్లాలో సైబర్ నేరాల నివారణపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించడం, సైబర్ నేరాలను నివారించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఇటీవల కాలంలో స్టాక్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు, బిజినెస్ పెట్టుబడి (ఇన్వెస్ట్మెంట్) మోసాలు, ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఫేక్ లోన్ యాప్లు, ఓటీపీ, కేవైసీ, సోషల్ మీడియా, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు అధికంగా జరుగుతున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ‘ఆగు ఆలోచించు, నిజం నిర్ధారించు, సైబర్ భద్రత పెంచు’ అనే సందేశాన్ని ప్రతిఒక్కరూ జీవితంలో ఆచరించాలి.


