గీసుకొండ: ‘కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి గోవిందా’ అంటూ భక్తులు పారవశ్యంతో చేసే నినాదాల మధ్య వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల జాతర మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. హోలీ పండుగను ముగించుకుని భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లించడానికి ఆలయానికి తరలొచ్చారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు మూసి వేశారు. అనంతరం ఆలయాన్ని తెరవడంతో భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. కొమ్మాల స్టేజీ నుంచి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మొదట కాంగ్రెస్ ప్రభ బండిని ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ సామాజిక సేవకుడు అల్లం బాలకిషోర్రెడ్డి సొంత ఖర్చుతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన ప్రభను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు అభిమానుల కేరింతల మధ్య ప్రారంభించారు. ఆ వర్గం నాయకుడు వీరగోని రాజ్కుమార్ ఆధ్వర్యంలో భారీగా నిర్వహించిన నృత్యప్రదర్శనలు జోష్ నింపాయి. బీఆర్ఎస్ ప్రభ బండిని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. బీజేపీ, ఎంసీపీఐ ప్రభలు జాతరకు తరలొచ్చాయి. జాతర సందర్భంగా ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి పోలీసులు మచ్చాపూర్, గిర్నిబావి మీదుగా వరంగల్–నర్సంపేట రహదారిలో ట్రాఫిక్ను మళ్లించారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్, గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో 257 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. గీసుకొండ తహసీల్దార్ ఎం.డి రియాజుద్దీన్, ఎంపీఓ శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ ఏడీఈ బానోత్ రవి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షించారు. అలయ ఈఓ ప్రసాద్, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు రామాచారి, ఫణీంద్ర, విష్ణు, ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 7న రాత్రి 10 గంటలకు స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.
వైభవంగా
ప్రారంభమైన జాతర
తరలిన ప్రభలు
ప్రత్యేక ఆకర్షణగా ‘కొండా’
ప్రభబండి


