కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో విద్యార్థులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్ప్రింగ్స్ప్రీ–26లో చోటు చేసుకున్న ఓ ఘటనతో సోమవారం అర్ధరాత్రి తర్వాత జూనియర్స్, సీనియర్స్ పరస్పరం దాడులు చేసుకున్నారు. ఫస్టియర్, సెకండియర్కు చెందిన సుమారు 12 మంది విద్యార్థులు హాస్టల్లో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా క్యాంపస్ ఉలిక్కిపడింది. దాడుల్లో నలుగురు విద్యార్థులకు గాయాలు కాగా మంగళవారం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం కళాశాలకు తీసుకొచ్చి నిట్ యాజమాన్యం కౌన్సెలింగ్ ఇచ్చింది. ఇలాంటి ఘటనలు మరోసారి ఉత్పన్నమైతే చర్యలు తీసుకుంటామాని హెచ్చరించింది.
ప్రతీ ఏడాది ఇదే తంతు..
నిట్ వరంగల్లో ప్రతీ ఏడాది నిర్వహించే టెక్నోజియాన్,స్ప్రింగ్స్ప్రీ వేడుకలు ఉత్సాహానికి బదులు ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఈ ఘటనలో యాజ మాన్యం చోద్యం చూస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఏకంగా తల్వార్లతో స్వైరవిహారం చేస్తూ దాడులకు పాల్పడ్డారు. మద్యం సేవించడం పరిపాటిగా మారినా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కళాశాలలో చర్యలు ఎక్కడా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
సెక్యూరిటీ ఎక్కడ?
వరుస ఘటనలతో నిట్ వరంగల్ ఉనికి ఎటు పోతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఓ సామాజిక వర్గానికి చెందిన వారు మరో సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని గొడవకు దిగడం సోషల్ మీడియాలో వైరలైంది. అలాగే, ఇటీవల పలువురు విద్యార్థులు బైక్లను మరో బైక్లతో ఢీకొట్టినట్లు సమాచారం. ఇంత జరుగుతున్న నిట్ ప్రధాన గేట్ వద్ద కాపలాకాస్తున్న సెక్యూరిటీ సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిట్లో ఘర్షణ పడిన విద్యార్థులు
పలువురికి గాయాలు.. కౌన్సెలింగ్ ఇచ్చిన యాజమాన్యం


