ఆదోని అర్బన్: దేశంలోని 15 ఉత్తమ పత్తి జిన్నింగ్ మిల్లులకు అవార్డులు ప్రకటించారు. ఇందులో ఆదోని బసాపురం రోడ్డులో ఉన్న ధారశ్రీ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ ఒకటిగా నిలిచింది. నాణ్యమైన దూది తయారీ, ఎప్పటికప్పుడు మిషనరీల శుభ్రత, అప్డేట్ చేయడం, ఆన్లైన్, ఆఫ్లైన్ సమావేశాల్లో సలహాలు, సూచనలు ఇవ్వడం ఇలా పలు అంశాల్లో ఈ పరిశ్రమ ఉత్తమమైనదిగా టెక్స్టైల్స్ కమిటీ ఎంపిక చేసింది. ఈ నెల 22న ముంబాయిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర టెక్స్టైల్స్ మంత్రి గిరిరాజ్సింగ్ చేతులమీదుగా పరిశ్రమ నిర్వాహకులు వెంకటరామిరెడ్డి, ఆదినారాయణరెడ్డి అవార్డు అందుకున్నారు. ఆదివారం ఆదోనికి చేరుకున్న వారిని స్థానిక వ్యాపారులు అభినందించారు. ఏపీ నుంచి తమ పత్తి మిల్లు ఒకటే ఉత్తమ పరిశ్రమగా నిలవడం గర్వకారణంగా ఉందని ధారశ్రీ పత్తి జిన్నింగ్ మిల్లు నిర్వాహకులు వెల్లడించారు.


