కర్నూలు(అగ్రికల్చర్): కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పకడ్బందీగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎనర్జీ డిపార్టుమెంటు ఓఎస్డీ పీహెచ్ జానకిరామ్ జిల్లా విద్యుత్ అధికారులను ఆదేశించారు. బుధవారం కర్నూలులోని విద్యుత్ భవన్లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ అమలులో పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం సూర్యఘర్ యూఎల్ఏ మోడల్ కింద ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ల పనుల్లో పురోగతి పెంచాలన్నారు. జిల్లాకు మంజూరైన 23,077 సోలార్ రూఫ్టాప్ ప్లాంట్లను ఈ నెల చివర్లోగా ఏర్పాటు చేసి గ్రిడ్కు అనుసంధానం చేయడంతో పాటు ఎంఎన్ఆర్ఈ పోర్టల్లో వివరాలను అప్లోడ్ చేయాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఆర్డీఎస్ఎస్ పనులను డిసెంబరు చివరిలోగా పూర్తి చేయాలన్నారు. పీఎం కుసుమ్– అగ్రికల్చర్ ఫీడర్లలో సోలరైజేషన్ పనుల పురోగతిని సమీక్షిస్తూ.. అగ్రిమెంటులోని నిబంధనల ప్రకారం పనులను ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్, ఈఈలు రాజశేఖర్, భాస్కరరావు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కల్లూరు మండలం ఏ.గోకులపాడులో నిర్మించిన సోలార్ రూఫ్టాప్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.


