గోనెగండ్ల: మండల పరిధిలోని గంజిహళ్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో బేస్త రమేష్ (20) అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గంజిహళ్లికి చెందిన పెద్ద బడేసావ్, ఈశ్వరమ్మకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి రెండెకరాల పొలం ఉంది. నాలుగేళ్ల క్రితం పెద్ద బడేసావ్ మృతిచెందాడు. దీంతో పెద్ద కుమారుడు రమేష్ పొలం పనులు చేస్తున్నాడు. గత నెలలో రూ.1.50 లక్షలు పెట్టి రెండు ఎద్దులను కొనుగోలు చేశాడు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం ఎద్దులను తీసుకొని పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా ఎద్దులు కట్టేసి ఉన్నాయి. రమేష్ సెల్ఫోన్ చెట్టుకింద పడిఉంది. రాత్రంతా గాలించినా అతని ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో మంగళవారం మల్లెల వాగు వంకలో రమేష్ శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న సీఐ చంద్రబాబు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలోని కొందరు రమేష్ను కొట్టి చంపి నీటి గుంతలో పడేశారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఐ చంద్రబాబు మాట్లాడుతూ.. అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేసుకున్నామని, శవ పరీక్ష నివేదిక ఆధారంగా విచారణ జరుపుతామని వెల్లడించారు.


