● నిరాహార దీక్షల టెంట్ తొలగింపు
ఆదోని: ఒకటి కాదు ..రెండు కాదు..ఏకబిగిన 269 రోజులు పాటు సాగిన ‘ఆదోని జిల్లా’ సాధన పోరాటానికి తెర పడింది. మంగళవారం ఆదోని మాజీ ఎంఎల్ఏ మీనాక్షినాయుడి సమక్షంలో దీక్షా శిబిరాన్ని తొలగిస్తుంటే దారిన వెళ్లే వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. టెంట్ను ఎందుకు ఎత్తివేయాల్సి వచ్చిందో మీనాక్షినాయుడు చెప్పిన మాటలు విని అందరూ ముక్కున వేలేసుకున్నారు. ‘ఇప్పట్లో ఆదోని జిల్లా ఇవ్వడం సాధ్యం కాదని! డీలిమిటేష్న్లో కొత్తగా జిల్లాలు ఏర్పడనున్నాయి..అప్పుడైనా త్వరగా మేల్కొని రండి..’ అని మంత్రి లోకేశ్ సలహా ఇచ్చారని, ఆ విషయాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులకు వివరించి దీక్షా శిబిరాన్ని తొలగింపజేశారు. అయితే లోకేశ్ హామీపై అందరూ పెదవి విరుస్తున్నారు. ‘ఆదోని జిల్లా కథ ఇక కంచికేనా..’ అని ఇటీవల ఆదోని లోకేశ్ పర్యటన సందర్భంగా సాక్షి ప్రచురించిన కథనాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియలోనైనా ఆదోనికి జిల్లా హోదా దక్కుతుందా? లేక ఉద్యమం మరోసారి రోడ్డెక్కుతుందా? అనేది వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


