● ఎస్పీకి విన్నవించిన ఆలూరు ఎమ్మెల్యే సతీమణి రామాంజనమ్మ
కర్నూలు (టౌన్): ఆలూరు నియోజవర్గం పరిధిలోని సంగాల, నేమకల్ గ్రామాలకు చెందిన ప్రత్యర్థి గ్రూపులకు చెందిన వ్యక్తులతో తన భర్త ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు కేసు నమోదు చేయించారని, శాఖాపరంగా విచారణ జరిపించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే సతీమణి రామాంజనమ్మ విన్నవించారు. బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలిసి ఇటీవల జరిగిన ఘటనను లిఖిత పూర్వకంగా అమె తెలియజేశారు. చిప్పగిరి పోలీసుస్టేషన్లో తన భర్తపై అక్రమంగా కేసు నమోదు చేశారని, అత్యుత్సాహం ప్రదర్శించి ఈనెల 2వ తేదీ అర్థరాత్రి 3 గంటల మధ్య 60 మంది పోలీసులు బలవంతంగా ఇంట్లోకి చొరపడ్డారన్నారు. ఇంట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆనవాళ్లు లేకుండా సీసీటీవీలను ధ్వంసం చేసి హర్డ్ డిస్క్లను సైతం లేకుండా చేశారన్నారు. ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారన్నారు. ఆలూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయిన తన భర్తకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా అరెస్టు చేశారన్నారు. తప్పుడు కేసు నమోదు చేశారని, డిపార్ట్మెంటల్ విచారణ జరిపించాలన్నారు. ఇంట్లో జరిగిన నష్టానికి పోలీసులు నష్టపరిహారం భరించాలని, సీసీటీవీలు, హర్డ్ డిస్క్లు ఇప్చించాలని కోరారు. అన్యాయంగా కేసులో ఇరికించిన వారిపై, పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.


