● రూ. 50 కోట్లతో నిర్మాణం
● శ్రీమఠం పీఠాధిపతి
సుబుధేంద్రతీర్థులు చేతుల మీదుగా
శంకుస్థాపన
మంత్రాలయం: ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా మంత్రాలయంలో గోశాల ఎదురుగా ఉన్న 25 ఎకరాల శ్రీమఠం భూమిలో గురువారం ఇంపౌండింగ్ రిజర్వాయర్కు భూమి పూజచేశారు. శ్రీమఠం పీఠాధిపతి శ్రీసుబుధేంద్రతీర్థులు చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం శ్రీవ్యాసతీర్థ రిజర్వాయర్గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మాణానికి బెంగళూరుకు చెందిన హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఎఎల్ ) ముందుకు వచ్చిందన్నారు. వచ్చే 30 సంవత్సరాల్లో పెరిగే జనాభాకు అనుగుణంగా తాగునీటి సరిపోయే విధంగా అంచనా రూపొందించారన్నారు. శ్రీగురు రాఘవేంద్రస్వామి భక్తుల కోసం ఈ కీలక ప్రాజెక్టుకు హెచ్ఎఎల్ సహకారం అందించడం సంతోషం అన్నారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తయారు చేసే సంస్థ రూ. 50 కోట్లు భరిస్తోందన్నారు. తుంగభద్ర నది కాలుష్యం కాకుండా భక్తులు చూడాలన్నారు. మురుగు నీరును ఫీల్డర్ చేసి తాగునీటిని చేస్తున్న తమిళనాడు ప్రభుత్వాన్ని అభినందించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల సమక్షంలో శ్రీమఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసులు, హెచ్ఎఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కె.రవి తో అధికారులతో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)కలసి ఒప్పంద పత్రాలు సంతకాలు చేశారు.
18 నెలల్లో పూర్తి
రిజర్వాయర్ సామర్థ్యం 20.67 ఎంసీఎఫ్టీలు (మిలియన్ క్యూబిక్ ఫీట్లు). రిజర్వాయర్ 35 అడుగుల తోతు ఉంటుంది. ఒక కిలోమీటరు దూరంలో ఉండే తుంగభద్ర నది నుంచి అత్యాధునిక టెక్నాలజీతో స్టీల్ పైపులైన్ వేయనున్నారు. రిజర్వాయర్కు అవసరమైన నీటిని తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోస్తారు. వరదనీరు వచ్చినప్పుడు, నదిలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు రిజర్వాయర్కు తరలిస్తారు. ఎండాకాలంలో భక్తులకు, గ్రామప్రజలకు ఈ నీటిని సరఫరా చేస్తారు. ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేయడానికి కృషి చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నాణ్యత ప్రామాణాలతో రిజర్వాయర్ పనులు చేస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీమఠం ఏఏఓ మాధవశెట్టి, శ్రీమఠం మేనేజర్–2 వెంకటేష్జోషి, ధార్మిక అధికారి శ్రీపతి, ఇంజినీర్ సురేష్కోనాపూర్, హాల్ సంస్థ హెచ్ఆర్ సభ్యులు బాలసుబ్రమణ్యం, డాక్టర్ గుప్త, మంజునాథ్, రమేష్, సోమన్చౌదరి, డిజైనింగ్ అధికారి రంగనాథ్, హాల్ సంస్థ అధికారులు, శ్రీమఠం అధికారులు పాల్గొన్నారు.
పర్యాటక ప్రాంతంగా..
మంత్రాలయంలో గోశాల ఎదురుగా 40 ఎకరాల శ్రీమఠం భూమి ఉంది. అందులో 25 ఎకరాల్లో మాత్రమే రిజర్వాయర్ నిర్మించనున్నారు. రిజర్వాయర్ పక్కన స్థలంలో అత్యాధునిక టెక్నాలజీతో పార్కు ఏర్పాటు చేయనున్నారు.ఈ స్థలాన్ని పర్యాటక ప్రాంతంగా విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దనున్నారు.


