కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో నమోదైన హిట్ అండ్ రన్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు నష్టపరిహారం త్వరగా అందేలా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ, హిట్ అండ్ రన్ కేసులపై శుక్రవారం డిస్ట్రిక్ట్ లెవెల్ అధికారులు కర్నూలు, నంద్యాల కలెక్టర్లు, ఎస్పీలు, రవాణా శాఖ అధికారులు, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు, జైలు సూపరింటెండెంట్లు, జిల్లాస్థాయి జైలు అధికారులతో హైబ్రిడ్ మోడ్లో మానిటరింగ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కేసుల వేగవంతమైన ప్రక్రియకు సంబంధించి జిల్లాస్థాయి కమిటీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. బాధితులకు లేదా వారిపై ఆధారపడిన వారికి అర్హత ప్రకారం పరిహారం చెల్లింపు జరిగేలా చూడాలన్నారు. 8వ తరగతి, ఆపై చదువుతున్న పేద గిరిజన విద్యార్థులు, వికలాంగ విద్యార్థినులు, తల్లిదండ్రులు లేని విద్యార్థినుల కేటగిరీల నుంచి సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా వారి ‘ప్రగ్య’ స్కాలర్షిప్లను పొందడానికి జిల్లాకు ఒకరి పేరు చొప్పున ఈనెల 21 లోపు పంపించాలని కలెక్టర్లకు సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారులు, రవాణా శాఖ అధికారులు, డీటీఆర్బీ అధికారులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు, సంబంధిత శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.


