పత్తికొండ: అన్నదాతలను చంద్రబాబు సర్కార్ దగా చేస్తోందని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. పత్తికొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులను కష్టపెట్టిన ప్రభుత్వాలు కాలగర్భంలో కలసిపోయాయని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో పంటలను సాగు చేసిన అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ఒట్టి కరువు వచ్చిందని, రైతులను అదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. వాతావరణ ఆధారిత పంటల బీమా ప్రీమియం చెల్లింపు కోసం కేవలం రెండు రోజులు సమయం ఇవ్వడం దారుణమన్నారు. సాగు చేసిన పత్తి, వేరుశనగ పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అర్ధరాత్రి సమయాల్లో కూడా రోడ్ల మీదనే ఉండి బీమా ప్రీమియం చెల్లించాల్సి వస్తోందన్నారు. జగనన్న హయాంలో పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేదని గుర్తు చేశారు. కరువు సమయాల్లో నష్టపరిహారం నేరుగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాతలను కష్టాలలోకి నెట్టి చోద్యం చూస్తున్నారన్నారు. పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదన్నారు. సకాలంలో రాయితీ విత్తనాలు ఇవ్వడం లేదని, ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వాతావరణ ఆధారిత పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు ఇంకా పదిరోజులు గడువు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్నదాతల తరఫున అందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు. విలేకరుల సమాశేవంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎంపీపీ నారాయణ్దాస్, బాబుల్రెడ్డి, భాస్కర్నాయక్, లలితా రామచంద్రా, బనగాని శ్రీనువాసులు, టీఎండీ హుస్సేన్, జయచంద్రారెడ్డి, గాంధిరెడ్డి, ముజుఫర్ రెహమాన్, ప్రభాకర్రెడ్డి, భరత్కుమార్రెడ్డి, శ్రీరాములు, అంజనేయులు, గోపాల్, సాబ్డిన్ నూర్బాషా, మహ్మమద్, రవిరెడ్డి, రంగన్న, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పంటల బీమా ప్రీమియం
చెల్లింపు గడువు
మరో పదిరోజులు పెంచాలి
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే
కంగాటి శ్రీదేవి


