● కలెక్టరేట్ ఎదుట ఎంపీహెచ్ఓల నిరసన
కర్నూలు(సెంట్రల్): అరకొర జీతాలతో పనిచేస్తున్నామని, అవి కూడా నాలుగు నెలలుగా ఇవ్వకపోతే ఎలా బతకాలని వ్యవసాయశాఖలో పనిచేస్తున్న మల్టీ పర్సన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు(ఎంపీహెచ్ఓలు) ప్రశ్నించారు. కలెక్టరేట్ ఎదుట గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఎంపీహెచ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.బసవరాజు మాట్లాడుతూ.. 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా కేవలం రూ.12 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారన్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం కింద ఎంపీహెచ్ఓలకు రూ.35 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగభద్రత కల్పించాలని, హెల్త్కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమాను వర్తింపజేయాలని కోరారు. విధి నిర్వహణలో చనిపోతే ఎక్స్గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ట్రెజరర్ మధుసూదన్గౌడ్ పాల్గొన్నారు.


