● వాము రైతులను దగా చేస్తున్న వైనం ● అనధికార కాటాదారులతో తూకాలు ● లైసెన్స్ల రద్దుకు నోటీసుల జారీ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము రైతులను దగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కమీషన్ ఏజెంట్లపై అధికారులు నిఘా పెట్టారు. మార్కెట్లో 38ఏ, 38బి, 28, 11ఏ, 11బి, 1, 40 షాపుల కమీషన్ ఏజెంట్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీరినే మార్కెట్లో వాము దొంగలుగా పేర్కొంటున్నారు. వీరు వాము పండించే ప్రాంతాలకు వెళ్లి రైతులకు మాయమాటలు చెప్పి తమ దుకాణాలకు వచ్చే విధంగా చేసుకుంటున్నారు. మార్కెట్కు దాదాపు 2000 క్వింటాళ్లు వస్తుండగా.. వీరికే అత్యధికంగా వస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో పండించిన వాము మార్కెట్కు ఎక్కువగా వస్తోంది. ఈ నెల 12వ తేదీ కర్ణాటకకు చెందిన ఓ రైతును అవినీతి ఆరోపణలు ఉన్న ఓ కమీషన్ ఏజెంటు తూకంలో దగా చేయడంపై మార్కెట్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా తూకాలు ఆలస్యం చేయడం, రైతుల కన్నుగప్పి దగా చేయడం సర్వసాధారణమైంది. కాటాకు సీలు తొలగించి అక్రమాలకు పాల్పడిన కమీషన్ ఏజెంటు మళ్లీ అదే తరహాలో సీలు తొలగించి వాము స్వాహా చేసినట్లు తెలుస్తోంది. తాజాగా శుక్రవారం కృష్ణవేణి ట్రేడర్స్ కమిషన్ ఏజెంటు దుకాణంలో కాటాకు సీలు తొలగించి తూకాలు వేస్తున్నట్లు అధికారులు గుర్తించి కాటాను స్వాధీనం చేసుకున్నా రు. లైసెన్స్ రద్దుకు నోటీసులు జారీ చేశారు. మరో వైపు శ్యాంపుల్స్ రూపంలో రైతుల నుంచి బలవంతంగా వాము తీసుకుంటున్న ఇద్దరు కాటాదారులకు లైసెన్స్ల రద్దు కోసం నోటీసులు జారీ చేశారు. అనేక ఆరోపణలు ఉన్న కమీషన్ ఏజెంట్లకే వాము ఎక్కువగా వస్తున్నందున లైసెన్స్ కలిగిన కాటాదారులే తూకాలు వేయాలని మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. రాత్రి పొద్దుపోయే వరకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.


