● 20 ఏళ్లుగా నాగలూటి వద్ద
అన్నదాన క్రతువు
● మల్లన్న భక్తుల ఆకలి తీర్చుతున్న
మహారాష్ట్ర బృందం
ఆత్మకూరురూరల్: దాహమేస్తే నీరు కూడా దొరకని నల్లమల ప్రాంతం. అలాంటి చోట పది రోజుల పాటు వేల మంది భక్తులకు నిత్యాన్నదానం చేయడం అంటే ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నదే. దాతల సహకారంతో దాదాపు 20 ఏళ్లుగా నాగలూటి ఆలయం వద్ద మహారాష్ట్ర బృందం అన్నదాన యజ్ఞం నిర్వహిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల నుంచి మొదలు యావత్తు ఉత్తర కర్ణాటక జిల్లాల నుంచి కన్నడిగులు, మహారాష్ట్రీయులు వందల కి.మీ. పాదయాత్రగా నల్లమల మీదుగా శ్రీశైలం చేరుకుంటారు. వీరి కోసం మహారాష్ట్ర బృందం అడవిలో మెట్ల పాదం వద్ద వెలసిన నాగలూటి వీరభద్ర స్వామి సమీపంలో 20 ఏళ్లుగా అన్నదాన శిబిరాన్ని నిర్వహిస్తోంది. కొల్లాపూర్ జిల్లాలోని ఇచ్చలకరంజికి చెందిన శ్రీశైల మల్లికార్జున మల్టీపర్పస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన శిబిరం నిర్వహిస్తున్నారు. పది రోజులపాటు 24 గంటలు నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ పది రోజుల్లో సుమారు 7 లక్షల మంది కన్నడిగులు ఈ అన్నదాన శిబిరాన్ని సందర్శించనున్నట్లు అంచనాలున్నాయి.
రోజుకు 50 వేల చపాతీలు తయారీ
అన్నదాన శిబిరంలో రోజుకు 50 వేల చపాతీలు తయారు చేసే ఆటోమేటిక్ మిషన్ను ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చారు. పిండి తడిపి, ముద్దలు చేసి ఆపై చపాతీలుగా రుద్ది, పెన్నంపై కాల్చే వరకు అంతా ఆటోమేటిక్గా మిషన్పై తయారవుతుంటాయి. అంతే కాక కూరగాయలు తరిగే మిషన్ వంటి ఎన్నో ఆధునిక వంట ఇంటి సామగ్రిని ఇక్కడ వినియోగిస్తున్నారు.
నాగలూటి వీరభద్రేశ్వరుడి సేవలో భాగంగా మా ట్రస్ట్ అన్నదాసోహ మహా కార్యం నిర్వహిస్తోంది. ట్రస్ట్ సభ్యులు, ఇతర దాతల సహకారంతో ఈ యజ్ఞం సాగుతోంది. సుమారు 200 మంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రవాణా తదితరాలు కూడా దాతల సహకారంతో సాగుతోంది. ఉచితంగా వైద్య శిబిరం కూడా నడిపిస్తున్నాం.
– ఎంఎస్ పాటిల్, అన్నదాన శిబిరం ట్రస్ట్ అధ్యక్షులు


