ఎమ్మిగనూరుటౌన్: మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తూ కుటుంబానికి ఆర్ధిక భరోసాగా నిలవాలని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టారేణుక అన్నారు. శుక్రవారం పట్టణంలోని వెంకటాపురం కాలనీ వద్ద బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గార్మెట్ యూనిట్ కేంద్రాన్ని ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అదేవిధంగా సోమప్ప సర్కిల్లో చలివేంద్రాన్ని ప్రారంభించి, కోతుల బావి ఆంజినేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గోనెగండ్ల రోడ్డులోని శ్రీఅంబా భవాని ఆలయంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదానంలో భాగంగా భక్తులకు వడ్డించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నజీర్అహమ్మద్, వైఎస్సార్సీపీ నాయకులు కామర్తి నాగేషప్ప, కంఠ, శివప్రసాద్, మధుబాబు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
వర్సిటీల అభివృద్ధికి కృషి
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆర్యూ వీసీ వి.వెంకట బసవరావు అన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి.వెంకటప్ప వర్సిటీల పర్యటనల్లో భాగంగా శుక్రవారం ఆర్యూను సందర్శించారు. ఆ వర్సిటీల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీల్లో గిరిజనులకు అందుతున్న ఫలాలను పరిశీలించేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నట్లు చెప్పారు. వీసీ మాట్లాడుతూ.. వర్సిటీల్లో అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్లు డాక్టర్ బి.విజయ్కుమార్ నాయుడు, డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. వర్సిటీలో కొందరు ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపచేయడం లేదని, వేతనాల్లో తేడాలు ఉన్నాయని తదితర విషయాలను వెంకటప్ప దృష్టికి తెచ్చారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయనను వర్సిటీ అధికారులు సన్మానించారు. వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ నరసింహులు, అకడమిక్ అఫైర్స్ డీన్ సీవీ కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


