జంట హత్యల కేసులో 12 మంది నిందితుల అరెస్ట్
పరారీలో మరో ఎనిమిది మంది
హత్యలకు కారణం కుళాయి నీటి గొడవలు
రెండేళ్లలో నలుగురు హత్య
ఎమ్మిగనూరు రూరల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కందనాతి గ్రామంలో ఈ నెల 5న జరిగిన బోయ పరమేష్, బోయ వెంకటేష్ జంట హత్య కేసులో 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను డీఎస్పీ ఎన్. భార్గవి మర్రివాడ వెల్లడించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ ఆదే శాల మేరకు.. రూరల్ సీఐ ఎస్. చిరంజీవి, రూరల్ ఎస్ఐ కె.శ్రీనివాసులు, హెచ్సీలు విక్టర్బాబు, బీరప్ప, కృష్ణ, చంద్ర, కానిస్టేబుళ్లు వెంకటాపురం తిప్పన్న, ఫయాజ్, సర్వేశ్వరరెడ్డి, అశోక్కుమార్, మల్లయ్య, జి. తిప్పన్న బృందంగా ఏర్పడి హత్య కేసులో నిందితుల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం వెంకటగిరి గ్రామ శివారు లోని ఇటుకల బట్టీ వద్ద నిందితులు ఉన్నారని సమాచారంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. జంట హత్యల కేసులో 20 మంది నిందితులు ఉండగా 12 మందిని అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి హత్యలకు ఉపయోగించిన మారణాయుధాలు, రెండు బైక్లు, టాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల్లో బిక్కి సీతారాముడు, బిక్కి రాముడు, బిక్కి వెంకటేష్, బిక్కి కేశవ, బిక్కి దుబ్బ నరసింహుడు, బిక్క. శంకరన్న, బిక్కి శ్రీహరి, బిక్కి విష్ణువర్దన్, బిక్కి హరిబాబు, బిక్కి అశోక్, బోయ బిక్కి మల్లేష్, బిక్కి అంజినప్ప ఉన్నారన్నారు. మరో ఎనిమిది పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. వీధి కుళాయి వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో తలెత్తిన ఘర్షణ హత్యల దాకా వచ్చిందన్నారు. రెండేళ్ల క్రితం బోయ బిక్కి తునకల రవి, బోయ బిక్కి తునకల నరసింహులను బోయ గోవిందు కుటుంబీలు దాడి చేసి చంపేశారన్నారు. హతుల కుమారులు కక్ష పెంచుకుని బోయ గోవిందు కుటుంబంపై ఈనెల 5వ తేదీ దాడి చేయడంతో గోవిందు సోదరులు పరమేష్, వెంకటేష్ హత్యకు గురయ్యారు. గోవిందు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. నిందితుల అరెస్ట్లో ప్రతిభ చూపిన సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
జంట హత్యల కేసులో 12 మంది నిందితుల అరెస్ట్


