
ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారానికి కృషి
కర్నూలు(అర్బన్): జిల్లాలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తెలిపారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు/జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది ఆదేశాల మేరకు స్థానిక న్యాయ సేవా సదన్లో ట్రాన్స్జెండర్ల హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్జెండర్లు తమకు గుర్తింపు కార్డులు, రేషన్కార్డులు లేని కారణంగా పింఛన్లు రావడం లేదని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ట్రాన్స్జెండర్లు అందుబాటులోని పథకాలను తెలుసుకొని ప్రయోజనం పొందాలన్నారు. టీజీఐడీ నేషనల్ పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు కార్డులు వస్తాయన్నారు. దివ్యాంగులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా మాట్లాడుతూ ట్రాన్స్జెండర్స్కు అనేక ప్రభుత్వ పథకాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్యానెల్ న్యాయవాది హేమలత మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు న్యాయ సహాయం అందించేందుకు తోడ్పడతామన్నారు. సదస్సులో ట్రాన్స్జెండర్ల నాయకులు వీణారెడ్డి, శ్రీవాణి, పావని తదితరులు పాల్గొన్నారు.