మచిలీపట్నంఅర్బన్: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఉయ్యూరు మండలం ఆకునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ)గా పనిచేస్తున్న కె. కృష్ణవేణి, చల్లపల్లి మండలం పురిటిగడ్డ జెడ్పీహెచ్ఎస్ ప్లస్లో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)గా పనిచేస్తున్న వి. ఉమా సరస్వతి, బాపులపాడు మండలం మల్లవల్లి మోడల్ ప్రైమరీ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తున్న కె. శివనాగ కృష్ణ అవార్డులకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఎ కన్వెన్షన్లో జరగనున్న కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. విద్యాబోధనలో ప్రతిభ, విద్యార్థుల అభ్యసనాభివృద్ధి, పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వీరిని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు ఎంపిక


