ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు నగదు బహుమతులు, సత్కారం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఒక ఛాయాచిత్రం.. వెయ్యి పదాలకు సమానమని, ఒక క్షణాన్ని బంధించి శాశ్వత జ్ఞాపకంగా నిలిపే కళ ఫోటోగ్రఫీ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తొలుత కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను, సమాచార, పౌర సంబంధాల శాఖ జోన్– 2 ఆర్జేడీ పి.తిమ్మప్ప, జిల్లాస్థాయి ఫొటోగ్రఫీ పోటీల జ్యూరీ సభ్యులు టీఎస్ రెడ్డి (ఎఫ్ఆర్పీఎస్), సీహెచ్ విజయభాస్కరరావు (ఏఆర్పీఎస్), కె.రవికుమార్ తదితరులతో కలిసి ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫొటో జర్నలిస్టుల్లోని ప్రతిభను ప్రోత్సహించి, గుర్తించి, సత్కరించేందుకు ఏటా జిల్లా స్థాయిలో ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో వీడియో జర్నలిస్టులు, అమెచ్యూర్ ఫొటోగ్రాఫర్లను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తామన్నారు. ఐ అండ్ పీఆర్ ఆర్జేడీ పి.తిమ్మప్ప మాట్లాడుతూ జర్నలిస్టులు అక్షర సైనికులు అయితే ఫొటోగ్రాఫర్లు దృశ్య సైనికులు అన్నారు.
విజేతలకు నగదు బహుమతులు
వివిధ విభాగాలలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో మొత్తం 27 మంది విజేతలుగా నిలిచారు. సాక్షి ఫొటో జర్నలిస్టులు ఎన్.కిశోర్, ఎస్.పవన్, కె.చక్రపాణితో పాటు మరో 24 మంది విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా జ్ఞాపికలు, నగదు బహుమతులు అందజేశారు. అనంతరం ఫొటోగ్రఫీ పోటీల విజేతలను సత్కరించారు. ఫొటోగ్రఫీ పోటీల్లో బహుమతులు పొందిన ఛాయాచిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనతో పాటు, సీనియర్ ఫొటోగ్రాఫర్ పొట్లూరి ప్రసాద్ సేకరించిన అరుదైన, వివిధ రకాల కెమెరాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్య క్రమంలో ప్రముఖ ఫొటోగ్రాఫర్లు టీఎస్ రెడ్డి, విజయభాస్కర్, కె.రవికుమార్, డీఐపీఆర్వో కేవీ రమణరావు, డీపీఆర్వో ఎన్.నాగేశ్వరరావు, డివిజనల్ పీఆర్వో కె. రవి, ఫొటోగ్రఫీ పోటీల సమన్వయకర్త వీవీ ప్రసాద్, వీఎంసీ పీఆర్వో డాక్టర్ రజియా షబీనా, సహాయ సమాచార ఇంజినీర్ కె.ధనుంజయరాజు, ఏవీఎస్ బి.బాలాజీ పాల్గొన్నారు.
ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఉద్యాన శాఖ, ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో ‘‘ఉద్యాన పంటల్లో అంతర పంటగా పూల తోటల పెంపకం, జీవ వైవిధ్యం, ఉత్పాదకత పెంపు’’పై రెండు రోజులుగా జరుగుతున్న శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. తొలిరోజు ఉద్యాన శాఖ, రైతు సేవా కేంద్రం సిబ్బందికి సాంకేతిక శిక్షణ ఇవ్వగా, రెండవ రోజు పెనమలూరు, ఉంగుటూరు మండలాల్లో క్షేత్రస్థాయిలో తోటల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన కీటక శాస్త్రవేత్త డాక్టర్ ధ్యానేశ్వర్ మధుకర్ ఫిరాకే, జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి అధ్యక్షతన వేమగిరి పూలతోటల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ నుంచి అవార్డులు అందుకుంటున్న
సాక్షి ఫొటోగ్రాఫర్లు కిశోర్, చక్రపాణి, పవన్


