జూడాల ఆందోళన ఉద్ధృతం ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న జూడాలు పదకొండో రోజు కొనసాగిన సమ్మె జీజీహెచ్లో రోగులకు తప్పని ఇక్కట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వం తమ స్టైపెండ్ పెంచకుండా ఎంత బెదిరింపు ధోరణితో వ్యవహరించినా జూడాలు తగ్గేదేలే అంటున్నారు. తాము చూపిస్తున్న సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన రాతపూర్వక హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని జూడాలు అంటున్నారు. దీంతో జీజీహెచ్లో వైద్యం చేసే వాళ్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ స్టైపెండ్ పెంచాలని, బోధనావైద్యుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచవద్దని, నాన్మెడికల్ వాళ్లను అసిస్టెంట్ టీచర్లుగా నియామకాలు చేపట్టవద్దంటూ జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మె 11వ రోజు కొనసాగింది. కాగా గురువారం ఉదయం వర్షం రావడంతో జూడాలు సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలోని బుద్ధుని విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జూడాలు తమ నోటిపై వేలుతో మౌన దీక్ష చేపట్టారు.
350 మందికిపైగా విధులు బహిష్కరణ..
తమ సమస్యల పరిష్కారం కోరుతూ సిద్ధార్థ వైద్య కళాశాలకు చెందిన సీనియర్ రెసిడెంట్స్, పోసు్ట్రగాడ్యుయేషన్ విద్యార్థులు, హౌస్సర్జన్స్ దాదాపు 350 మంది వరకూ విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో జీజీహెచ్లో వైద్య సేవలు స్తంభించాయి. మరోవైపు క్యాజువాలిటీ, ఆపరేషన్ థియేటర్స్, లేబర్ వార్డు వంటి వాటిలో వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ, వాస్తవంగా అలాంటి చర్యలు ఏమీ లేక పోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.
స్పష్టమైన హామీ ఇవ్వండి..
ప్రభుత్వం తమ స్టైపెండ్ పెంచే విషయంలో అసత్య ప్రచారం చేస్తూ, బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోందని జూడాలు అంటున్నారు. తమకు 20 శాతం మేర స్టైపెండ్ పెంచేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలంటున్నారు. అంతేకాని తమను సంప్రదించకుండా ప్రభుత్వం 5శాతం ఇస్తాం.. 3శాతం ఇస్తాం అంటూ ప్రకటనలు చేయడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం తప్పుదారి పట్టించే యత్నాలు చేస్తోందని, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ ఆందోళన చేస్తామంటున్నారు.


