మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో 2026–27 విద్యాసంవత్సం డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయిందని అధ్యయన కేంద్రం డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.అజంతకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, బీఎల్ఐఎస్సీ కోర్సులలో ప్రవేశాలకు యూనివర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లమో కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులన్నారు. అడ్మిషన్ కోసం విద్యార్థులు ఏబీసీడీ ఐడీ, డీఇబీ ఐడీను క్రియేట్ చేసుకుని అడ్మిషన్ పోర్టల్కి లాగిన్ కావాలని సూచించారు. ఆసక్తి అర్హత కలిగిన వారు వచ్చేనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం విజయవాడ మాచవరం ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రాంతీయ కార్యాలయంలో స్వయంగా కానీ, 0866–2434868, 7382929642 నంబర్లలో కానీ సంప్రదించాల్సిందిగా కోరారు.
వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యా పురస్కారానికి ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 26వ తేదీ వరకూ గడువును పొడిగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్.చంద్రకళ తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో సెప్టెంబర్ ఐదో తేదీన సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. దానికి గాను జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న అన్ని ప్రభుత్వ యజమాన్య పరిధిలోని అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా పదేళ్ల బోధన అనుభవం కలిగి ఉండి, విద్యాశాఖ నిర్ణయించిన అర్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మండల విద్యాశాఖ అధికారులకు తమ దరఖాస్తులను గడువులోపు సమర్పించాలని వివరించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 నుంచి ఇంటర్మిడియట్ చదివిన ఎస్సీ నిరుద్యోగ యువకులు కిసాన్ డ్రోన్ ఆపరేటర్ (10వ తరగతి పాస్), డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్ (8వ తరగతి పాస్), అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ (10వ తరగతి పాస్), సోలార్ పీవీ ఇన్స్టాలర్ (సూర్యమిత్ర) (ఇంటర్మీడియట్ పాస్), ఎలక్ట్రికల్ వెహికల్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (8వ తరగతి పాస్), బ్యూటీ థెరపిస్ట్ (10వ తరగతి పాస్), ప్లంబర్ – జనరల్ కోర్సులు (10వ తరగతి పాస్)లలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకునే వారు 21 నుంచి 45 సంవత్సరాల్లోపు వయసు ఉండాలన్నారు. దరఖాస్తుతో పాటు విద్యార్హత పత్రాలు, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, రేషన్కార్డు నకళ్లతో ఐదురోజుల్లోగా ఎస్సీ కార్పొరేషన్ మచిలీపట్నం కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు 9848214161, 9652057244 నంబర్లను సంప్రదించాలన్నారు.


