శోక తప్త హృదయాలతో తండ్రికి అంత్యక్రియలు
పామర్రు: తమ తండ్రి అంత్యక్రియలు తామే జరుపుకుంటామని ముందుకొచ్చిన కుమార్తెలు సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పామర్రు గ్రామంలోని అరండాల్ పేటకు చెందిన పలగాని వెంకట నారాయణ(65) గుండె పోటుతో సోమవారం మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి అంత్యక్రియలు జరిపేందుకు కుమారుడు లేకపోవడంతో బంధు మిత్రులు ఆందోళన చెందుతుండగా , ఈ విషయాన్ని గ్రహించిన మృతుడి కుమార్తెలు ముందుకొచ్చి తమ తండ్రి అంత్యక్రియలు తామే నిర్వహించి తమ తండ్రి రుణం తీర్చుకుంటామని ముందుకు రావడం పలువురిని ఆశ్చర్యపర్చింది. మృతుడి ఇద్దరు కుమార్తైలెన లత, ప్రసన్న తండ్రి పాడెను మోశారు. పెద్ద కుమార్తె జ్యోతి దహన సంస్కారాలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించింది. తండ్రి పాడెను పట్టే సందర్భంలో తమ తండ్రిని ఇక చూడలేమని తలచి బాధా తప్త హృదయాలలో నడుస్తూ శ్మశాన వాటికకు వెళ్లడంతో పలువురి కళ్లు చెమ్మగిల్లాయి. స్థానిక హిందూ శ్మశాన వాటిలో అంత్య క్రియలను పూర్తిచేశారు.
అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): అప్పుల బాధను తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్నగర్ ఎక్సెల్ప్లాంట్ సమీపంలోని అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న చెట్ల పిచ్చేశ్వరరావు(45) అలియాస్ పిచ్చయ్య సత్యనారాయణపురం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎదుట సోడాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి భార్య సత్యవతి, 19 ఏళ్ల కుమార్తె ఉన్నారు. పిచ్చయ్య తనకు బాగా అప్పులు ఉన్నాయని, నేను చనిపోతానని తరచూ ఇంటిలో వారిని బెదిరిస్తూ ఉండేవాడు. అప్పులు ఎక్కువైపోవడంతో గత ఆరు నెలల నుంచి సోడాల షాపు కూడా తీయకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం ఉదయం 6 గంటలకు తనకు చాతిలో గ్యాస్ నొప్పి వచ్చిందని భార్యతో చెప్పి టాబ్లెట్ వేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఇంటి బయట వరండాలో కూర్చొని ఉండగా పిచ్చయ్య ఇంటి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఇంట్లో పని చేసుకుందామని సుమారు ఉదయం 9.00 గంటల సమయంలో సత్యవతి ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంటిలో ఫ్యాన్ హుక్కుకు చీరతో ఉరివేసుకొని వేలాడుతూ పిచ్చయ్య కనిపించాడు. దీంతో చుట్టుపక్కల వారి సహాయంతో అతన్ని కిందకు దించి 108 అంబులెన్స్ని పిలవగా వారు పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


