మచిలీపట్నంఅర్బన్: వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో కొందరు నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విజువల్లీ చాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె. ఫణికుమార్రెడ్డి ఆరోపించారు. సోమవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో వికలాంగులు వచ్చి ఇన్చార్జి కలెక్టర్ ఎం.నవీన్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఫణికుమార్రెడ్డి మాట్లాడుతూ.. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి మార్చిలో నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. ఇటీవల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసి, 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను వికలాంగత్వ ధ్రువీకరణ కోసం మెడికల్ బోర్డుకు పంపించారని చెప్పారు. చాలామంది అభ్యర్థుల వికలాంగత్వాన్ని మెడికల్ బోర్డు ధ్రువీకరించి నివేదికలు అందజేసిందన్నారు. అయితే క్లాప్–4 ఉద్యోగాల భర్తీలో కొందరు నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఉదాహరణగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ అంధ అభ్యర్థి విజయవాడలోని కొన్ని పాఠశాలల పేరుతో నకిలీ విద్యార్హత ధ్రువ పత్రాలు పొందినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
విద్యార్హతలను పూర్తిగా ధ్రువీకరించాలి..
అభ్యర్థుల విద్యార్హత ధ్రువపత్రాలను డీఈఓ ఆధ్వర్యంలో 1:3 నిష్పత్తిలో సంబంధిత ఎంఈఓల ద్వారా ఆయా పాఠశాలలకు పంపించి, సర్టిఫికెట్లు నిజమైనవేనని నిర్ధారించిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు.
విజువల్లీ చాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఫణికుమార్రెడ్డి ఆరోపణ


