మచిలీపట్నంఅర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా జూని యర్ డాక్టర్లు చేపట్టిన నిరసనలో భాగంగా మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఎస్పీవీ జీఎంసీ జూనియర్ డాక్టర్లు శాంతియుతంగా నిరసన తెలిపారు. జూని యర్ డాక్టర్లకు ప్రస్తుతం అందుతున్న స్టైపెండ్ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, కర్ణాటకతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో స్టైపెండ్ తక్కువగా ఉందని, ఆయా రాష్ట్రాల స్థాయిలో ఏపీలోనూ పెంచాలని కోరారు. నిరసన కారణంగా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవలతో పాటు అన్ని వైద్య సేవలను యథావిధిగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి స్టైపెండ్ పెంపుపై తక్షణ నిర్ణయం తీసుకోవా లని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల మచిలీపట్నం అధ్యక్షుడు డాక్టర్ కె.శివబ్రహ్మం, ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్. అనిల్కుమార్, డాక్టర్ ఎం.కోమల్ ఫణిర్మయి, కార్యదర్శి డాక్టర్ దివాకర్రెడ్డి, ఎ. సంతోషిని, ఎస్ఆర్ అండ్ పీజీ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, సాంకేతిక ఆధారిత పరిపాలన ద్వారా చేపడుతున్న వినూత్న కార్య క్రమాలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతినిధి బృందం నుంచి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందించడంతో ది కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భవనారి వెంకటేష్బాబు, కొప్పోలు సుధాకరరావు బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ప్రతినిధి బృందం ఏపీ ముఖ్యమంత్రితో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ పియూష్ కుమార్, చీఫ్ కమిషనర్ అహ్మద్బాబు సమక్షంలో నిర్వ హించిన సమావేశంలో రాష్ట్ర ఏపీ పరిపాలనలో అమలు చేస్తున్న వినూత్న సాంకేతిక కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించడం రాష్ట్రానికి, వాణిజ్య పన్నుల శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానాలను ఇతర రాష్ట్రాల్లో అనుసరించదగిన ఉత్తమ పద్ధతులుగా జీఎస్టీ కౌన్సిల్ ప్రతినిధి బృందం గుర్తించడం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు లభించిన విశిష్ట గౌరవమని వివరించారు.
మచిలీపట్నం అర్బన్: హెచ్ఐవీ, ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటంతోపాటు సరైన అవగాహన కలిగి ఉండాలని కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎల్.దయాకర్ సూచించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి సూచ నల మేరకు ‘సుఖవ్యాధులు, హెచ్ఐవీ, ఎయిడ్స్పై విస్తృత ప్రచార కార్యక్రమం’ను బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రారంభించారు. అక్టోబర్ 12వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ దయాకర్ జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ అంబటి వెంకట్రావు, జిల్లా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ పి.కిరణ్, జిల్లా న్యూక్లియర్ మెడికల్ అధికారి డాక్టర్ వేణుగోపాల్, గైడ్ ప్రోగ్రాం మేనేజర్ శశికళ, యోజన సంక్షేమ సంఘం ప్రోగ్రాం మేనేజర్ ప్రశాంతి, అంకిత సంస్థ ప్రోగ్రాం మేనేజర్ అరుణ్, వాసవి మహిళా మండలి ప్రోగ్రాం మేనేజర్ రాజమోహన్ పాల్గొన్నారు.
కోనేరుసెంటర్(మచిలీపట్నం): బాలికపై బాలుడు లైంగికదాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. కంకిపాడుకు చెందిన బాలిక పదో తరగతి వరకు చదువు కుని ఇంటి వద్దే ఉంటోంది. మచిలీపట్నం టెంపుల్కాలనీకి చెందిన పదో తరగతి విద్యార్థికి కంకిపాడులో బంధువులు ఉండటంతో తల్లిదండ్రులతో అక్కడికి వెళ్లొస్తుండేవాడు. ఈ నేపథ్యంలో బాలిక, బాలుడి మధ్య స్నేహం ఏర్పడింది. రెండు నెలల క్రితం బాలిక మంగినపూడి బీచ్కు వెళ్లొస్తానని తల్లిదండ్రులకు చెప్పి మచిలీపట్నం వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్లకుండా తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను బాలుడి ఇంటి వద్ద ఉన్నానని చెప్పి, అతని తల్లిదండ్రులతో మాట్లాడించింది. వారం రోజులు మచిలీపట్నంలోనే ఉండి కంకిపాడు వెళ్లింది. మంగళవారం బాలిక అస్వస్థతకు గురి కావటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకె ళ్లారు. పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది బాలిక రెండు నెలల గర్భవతని చెప్పారు. బాలిక తల్లిదండ్రులు కంకిపాడులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంకిపాడు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును చిలకలపూడి పోలీసులకు బదిలీచేశారు. చిలకలపూడి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికకు వైద్య పరీక్షల అనంతరం తదుపరి దర్యాప్తు చేపడ్తామని సీఐ నబీ తెలిపారు.


