మొగల్రాజపురం(విజయవాడతూర్పు): నగరం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేరేందుకు సోమవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ ఎం.విజయసారథి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలి రెండు విడతల కౌన్సెలింగ్లలో మిగిలిన సీట్లను ఈ స్పాట్ అడ్మిషన్లలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, పాలిసెట్–2026 పరీక్ష రాసిన, రాయని వారు పాల్గొనవచ్చని సూచించారు. అభ్యర్థులు సోమవారం ఉదయం పది గంటలకు తమ విద్యార్హతా ఓరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ పత్రాలతో కళాశాలకు హాజరు కావాలని పేర్కొన్నారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): అనుమానాస్పదస్థితిలో హోమ్ ట్యూషన్ టీచర్ ఓ లాడ్జిలో మృతిచెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పెనమలూరు మండలం, తాడిగడపకు చెందిన లక్ష్మీపురపు వెంకటరమణ, కుటుంబరావు (59) భార్యాభర్తలు. వారి కుమార్తెకు వివాహమై సౌత్ఆఫ్రికాలో ఉంటుండగా, కుమారుడు బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. భర్యాభర్తలిద్దరూ హోమ్ ట్యూషన్లు చెప్పుకొని జీవిస్తున్నారు. కుటుంబరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల నాలుగున ట్యూషన్ చెప్పడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో కృష్ణలంక ఫీడర్రోడ్డులో బస్టాండ్ ఎదురుగా ఉన్న లాడ్జి సిబ్బంది వెంకటరమణకు ఫోన్చేసి కుటుంబరావు శుక్రవారం ఉదయం తమ వద్ద రూమ్ తీసుకున్నారు, అద్దె చెల్లించాలని చెప్పారు. తన భర్త మూడు రోజులుగా ఇంటికి రాకపోవడంతో అతను కనిపించడంలేదని పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశానని వెంకటరమణ బదులిచ్చారు. అనంతరం పకీర్గూడెంలో నివసించే కుటుంబరావు సోదరుడు వెంకట సత్యనారాయణకు సమాచారం విచ్చారు. ఆయన లాడ్జి వద్దకు వెళ్లి చూడగా కుటుంబరావు తీసుకున్న రూమ్ తలుపులు వేసి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా కుటుంబరావు విషం తాగి బెడ్పై పడి ఉన్నాడు. అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని అతడిని పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి బలవన్మరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇంటిలో ఎవరూ లేని సమయంలో యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. కృష్ణలంక పోలీసుల కథనం మేరకు.. రాణిగారి తోట ముక్కు శ్రీరామిరెడ్డి రోడ్డుకు చెందిన కాయల రాము ఉడ్ పాలిష్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి పెద్ద కుమారుడు సూర్యచంద్ర మొబైల్ రిపేర్ పనిచేస్తుండగా చిన్న కుమారుడు పవన్కుమార్(22) కొద్దిరోజులు వన్టౌన్లోని ఓ షాపులో పనిచేశాడు. ప్రస్తుతం పని మానేసి ఇంటివద్దనే ఉంటున్నాడు. శనివారం ఉదయం రాము పనికి వెళ్లాడు. ఆ తరువాత రాము పెద్ద కుమారుడు షాపునకు వెళ్లి తిరిగి రెండు గంటల సమయంలో భోజనానికి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో దగ్గరగా ఉన్న ఇంటి తలుపులు తెరిచి లోపలకి వెళ్లి చూడగా పవన్కుమార్ వంటగదిలో స్లాబ్ కొక్కేనికి చీరతో ఉరేసుకొని వేలా డుతూ కనిపించాడు. వెంటనే సూర్య చంద్ర తన బంధువుల సహాయంతో పవన్ను కిందకు దించి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి పవన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


