ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
ప్రభుత్వ పథకాల పేరుతో మాయాజాలం
జి.కొండూరు: ఎలక్ట్రానిక్ డివైజ్లు ఉచితం, ఫోన్ డేటా రీచార్జ్ ఉచితం, ఇన్సూరెన్స్లు ఉచితం అనగానే ఎగబడి వెబ్ లింక్లను నొక్కేస్తున్నారు. అంతే సైబర్ నేరగాళ్లు ఫోన్లలోకి చొరబడి డేటా చోరీ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలలో ఉన్న నగదును మాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ తరహా దందా గ్రామీణ ప్రాంతాల్లోకి చొరబడింది. గ్రామీణ యువతను టార్గెట్ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడడం కలవరానికి గురి చేస్తోంది. అందుబాటులోని ఆధునిక టెక్నాలజీని సరైన పద్ధతిలో వినియోగించకపోతే మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుందనడానికి సైబర్ మోసాలే నిదర్శనమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఒకేరోజు రెండు కేసులు..
మైలవరం పోలీసు డివిజన్ పరిధిలోని జి.కొండూరు, రెడ్డిగూడెం మండలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని స్వల్ప మొత్తంలో నగదును కోల్పోయి మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. గతంలో జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన ముగ్గురు సంక్షేమ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో చిక్కుకొని నష్టపోయారు.
సైబర్ నేరాలపై నిత్యం అవగాహన కల్పిస్తున్నాం. ఉచితం అని ప్రకటనలు రాగానే ఆశపడి మోసపోతున్నారు. వాట్సాప్, పేస్బుక్, ఇన్స్టా, సాధారణ మెసేజ్ల ద్వారా వచ్చే వెబ్ లింక్లను అస్సలు టచ్ చేయవద్దు. ప్రభుత్వ పథకాల పేరుతో రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రోసెసింగ్ ఫీజు చెల్లించాలి అంటే స్పందించవద్దు. ప్రభుత్వ పథకాల వివరాలను అధికారిక వెబ్సైట్లు, సంబంధిత కార్యాలయాల ద్వారానే తెలుసుకోవాలి. తెలియని వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు, యూపీఐలకు డబ్బులు పంపవద్దు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయడం లేదా సమీపంలోని పోలీసు స్టేషన్ను సంప్రదించాలి.
– సతీష్కుమార్, ఎస్ఐ, జి.కొండూరు
సైబర్ నేరగాళ్లు తల్లికి వందనం పథకం అమలును ఆసరాగా చేసుకొని గతేడాది భారీగా మోసాలకు పాల్పడ్డారు. గతేడాది ప్రభుత్వం తల్లికి వందనం నగదు జమ చేసిన జూన్ 12వ తేదీని సైబర్ నేరగాళ్లు నేరం చేసేందుకు అనువుగా ఎంచుకున్నారు. అనుకున్న ప్రకారం ముందుగా జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన గతంలో గ్రామ వలంటీర్లుగా పని చేసిన వారికి ఫోన్ చేసి మిమ్మల్ని మరలా గ్రామ వలంటీర్లుగా తీసుకుంటున్నామని, ఎక్కువ జీతం కూడా వస్తుంది అని నమ్మ బలికారు. వారి దగ్గర గతంలో అమ్మ ఒడి పొందిన లబ్ధిదారుల పేర్లు, ఫోన్ నంబర్లు ఇవ్వాలంటూ అడిగారు. దీనితో సదరు మాజీ గ్రామ వలంటీర్లు వారి దగ్గర ఉన్న పేర్లు, ఫోన్ నంబర్లను ఇచ్చారు. వారిలో తల్లికి వందనం పెండింగ్లో ఉన్న వారిని మోసానికి అనువుగా ఎంచుకున్నారు. వారితో ఫోన్లో మాట్లాడి.. పెండింగ్లో నగదు మీ ఖాతాలలో జమ కావాలంటే కొంత అమౌంట్ మీరు ఫలానా ఖాతాలో జమ చేయాలని చెప్పి ముగ్గురు నుంచి రూ.44వేలు కాజేసి ఉడాయించారు. ముగ్గురు బాధితులు మోసపోయామని తెలుసుకొని పోలీసులను సంప్రదించారు. ఇప్పుడు తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో తల్లులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


