గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి
కొండపర్వ(విస్సన్నపేట): విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న వనరులను సద్వినియోగం చేసుకొని, బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మండలంలోని కొండపర్వ గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఎమ్మెల్యే కె. శ్రీనివాసరావుతో కలసి మంత్రి మంగళవారం సందర్శించారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. గురుకుల పాఠశాలకు వచ్చే రహదారి సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని ఓ విద్యార్థి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రహదారి ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి అన్నారు. విద్యార్థులకు వడ్డించే ఆహారం, పాఠశాల వసతులను, డార్మెటరీలను పరిశీలించారు. విద్యార్థులతో కలసి మంత్రి, ఎమ్మెల్యే భోజనం చేశారు.
మౌలిక వసతుల కల్పన..
అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు వసతి గృహాలలో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో గిరిజన సంక్షేమ శాఖ నుంచి 2,500 కోట్లను రోడ్లు, హస్టళ్లు నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించామన్నారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ ప్రసాద్, తహసీల్దార్ కె. లక్ష్మీకల్యాణి, ఏఓ చందా ప్రసాద్, డెప్యూటీ ఎంపీడీఓ రామ్మోహనరావు, ఎంఈఓ సుధాకర్, గురుకుల కళాశాల కన్వీనర్ ప్రిన్సిపాల్ జి. ప్రసూన, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వాణి పాల్గొన్నారు.


