బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించండి | - | Sakshi
Sakshi News home page

బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించండి

Jul 18 2026 9:45 AM | Updated on Jul 18 2026 9:45 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎల్‌నినో నేపథ్యంలో బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే రైతులతో పాటు, తీసుకోని రైతులు కూడా తప్పనిసరిగా బీమా పథకాల్లో చేరాలని కలెక్టర్‌ సూచించారు. కలెక్టరేట్‌లోని ఏవీఎస్‌ రెడ్డి హాల్‌లో శుక్రవారం కలెక్టర్‌ లక్ష్మీశ అధ్యక్షతన వ్యవసాయ, ఉద్యాన, సహకార, బ్యాంకింగ్‌, బీమా సంస్థల అధికారులతో సమావేశం జరిగింది. ఎల్‌నినో ప్రభావం వంటి పరిస్థితుల నేపథ్యంలో పంట నష్టాల ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నందున రైతులకు ఫసల్‌ బీమాపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల్లో చేరేలా ప్రోత్సహించాలన్నారు. ఇందుకు సమన్వయ శాఖల అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు.

నోటిఫై చేసిన పంటలివే..

ఖరీఫ్‌–2026 సీజన్‌కు జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం కింద వరి, ఎర్రమిరప, మొక్కజొన్న, పెసర పంటలను నోటిఫై చేశారన్నారు. పున ర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద పత్తిని నోటిఫై చేసినట్లు వివరించారు. వీటితో అతి తక్కువ ప్రీమియంతోనే కష్టకాలంలో అధిక ఆర్థిక భరోసా లభించనుందని చెప్పారు. వరికి ఎకరాకు బీమా మొత్తం రూ.42,500 కాగా, రైతు వాటా ప్రీమియం రూ.850 చెల్లిస్తే సరిపోతుందన్నారు. వరికి సంబంధించి పథకంలో నమోదుకు ఆగస్టు 15వ తేదీ ఆఖరు తేదీ కాగా ఎర్ర మిరప, మొక్కజొన్న, పెసరకు జూలై 31 చివరితేదీ అని తెలిపారు. పత్తికి ఈ నెల 24వ తేదీలోగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. పంట రుణం తీసుకున్న రైతులకు రుణంతో పాటు అదనంగా బీమా ప్రీమియం కూడా మంజూరవుతుందని, పంట రుణాలు తీసుకోని రైతులు నమోదుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, జాతీయ పంటల బీమా పోర్టల్‌, స్వర్ణ గ్రామం, తపాలా కార్యాలయాలను ఉపయోగించుకోవచ్చన్నారు. పంట రుణాలు తీసుకోని రైతులు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. పథకాలకు సంబంధించిన సమాచారం, సందేహాల నివృత్తి కోసం స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్‌, జిల్లా ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ అధికారి డీవీ శివరామ ప్రసాద్‌, గరికపాడు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ ఐ.వెంకటరెడ్డి, ప్రగతిశీల రైతు యు.మాధవరావు, యూబీఐ సీనియర్‌ మేనేజర్‌ అబ్దుల్‌ సలామ్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement