పట్టణంలో స్వచ్ఛ భారత్లో పాల్గొననున్న చంద్రబాబు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ
గుడివాడరూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం స్వచ్చభారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుడివాడకు రానున్నారు. బైపాస్రోడ్డులోని కేకేఆర్ గౌతమ్ స్కూలు వద్ద జరగనున్న స్వచ్ఛభారత్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, సీఎంవో అధికారులతో కలసి గుడివాడ బైపాస్రోడ్డు, ఇంజినీరింగ్ కళాశాల, ఏఎన్ఆర్ కళాశాలలను పరిశీలించారు. సీఎం పర్యటనలో భాగంగా ఏఎన్ఆర్ కళాశాలలో హెలీప్యాడ్, ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభ, బైపాస్రోడ్డులోని యలవర్తి గ్రౌండ్స్లో టీడీపీ ముఖ్య నేతల సమావేశ వేదికలను అధికారులు ఖరారు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్కుమార్, ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ మనోహర్, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, పలు శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


