లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంగా ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పనిచేస్తున్న గారపాటి పార్థసారథి గోల్డ్మెడల్ విరాళాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుకు అందజేశారు. ఏటా జనరల్ సర్జరీలో ప్రతిభ చూపిన విద్యార్థికి తన తల్లిదండ్రులైన గారపాటి దశరథ రామయ్య. పీఆర్వీ పుత్రిక పేరిట స్మారక గోల్డ్మెడల్ను అందిస్తున్నారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ఫార్మకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కె. విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్జిల్లా పోలీస్ కమిషనరేట్లోని సీఎస్డబ్ల్యూ డీసీపీగా బి. సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం కల్పించిన ఉద్యోగోన్నతుల్లో నాన్ కేడర్ ఎస్పీ హోదాలో కృష్ణా జిల్లాలో ఏఆర్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణను విజ యవాడ సీఎస్డబ్ల్యూ డీసీపీగా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. ఆయన సీపీ ఎస్వీ రాజశేఖర బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ లోక్అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా జడ్జి కె. సునీత తెలిపారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవా సదన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. వరలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఈ ఏడాదిలో రెండో జాతీయ లోక్ అదాలత్ను శనివారం నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 45బెంచ్లలో ఈ లోక్అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీ పడ దగ్గ క్రిమినల్, చెక్బౌన్స్ కేసులు, ట్రాఫిక్ చలానా, అన్ని రకాల సివిల్ కేసులు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్ కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చన్నారు. గత మార్చి 14న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1,09,388 కేసులు పరిష్కారమయ్యాయని, ఈసారి అంతకంటే ఎక్కువ కేసులను పరిష్కరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో హాస్పిటాలిటీ రంగానికి సంబంధించి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను పునరుద్దరించాలని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలెండర్పై అమలులో ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుతో కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి దుర్గేష్ను కలిసినవారిలో ఏపీ చాంబర్స్ సలహాదారు లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు పి.భాస్కరరావు, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి, ప్రధాన కార్యదర్శి ఎస్. మూర్తి చిట్టూరి ఉన్నారు.


