రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ శ్రీనివాసరావు
భవానీపురం(విజయవాడపశ్చిమ): సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)లోని సెక్షన్ 4(1)(బి) నిబంధనలను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా అమలు చేయాలని, చట్టం అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సజ్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆర్టీఐ చట్టం అమలుపై శుక్రవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గొల్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ కార్యాలయం, గొల్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంతోపాటు డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, బందరు రోడ్లోని ఏపీపీఎస్సీ కార్యాలయాలను సందర్శించి, ఆర్టీఐ చట్టం అమలు తీరును పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆయా కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఆర్టీఐ రిజిస్టర్లు, రికార్డులు, పౌరులకు అందిస్తున్న సమాచార వ్యవస్థను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దేవదాయ శాఖలో ఆర్టీఐ చట్టం అమలు తీరును దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ కమిషనర్కు వివరించారు.
సమర్థంగా అమలు..
శ్రీనివాసరావు మాట్లాడుతూ గత కొంత కాలంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదంటూ కమిషన్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందున్నాయని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం, విధి నిర్వహణలో లోపా లు లేదా నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ సి.శశిధర్, కార్యదర్శి పి. రవి సుభాష్ పాల్గొన్నారు.


