చిట్టినగర్(విజయవాడపశ్చిమ): రియల్ ఎస్టేట్లో నష్టాలతో ఆర్థికంగా ఇబ్బందులకు గురైన ఓ వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అంబాపురం పంచాయతీ పరిధిలోని పైపుల రోడ్డుకు చెందిన సాగి శ్రీనివాస్రాజా(60) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. కొంత కాలంగా రియల్ ఎస్టేట్లో నష్టాలు వస్తున్నాయని కుమారుడు సుబ్బరాజుతో చెప్పుకొని బాధపడేవారు. ఈ క్రమంలో ఈ నెల తొమ్మిదో తేదీన ఆఫీసుకు వెళ్లిన శ్రీనివాసరాజాకు కుమారుడు ఫోన్ చేయగా పని మీద బయటకు వెళ్లినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం శ్రీనివాస్ రాజా ఇంటికి రాకపోవడంతో కుమారుడు మళ్లీ ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన సుబ్బరాజు పైపుల రోడ్డులో ఉన్న కార్యాలయానికి వెళ్లారు. ఆఫీసు ముందు బైక్ ఉండటంతో లోనికి వెళ్లి చూడగా, నేలపై శ్రీనివాస్రాజా పడి ఉన్నారు. అతనికి కొద్ది దూరంలో పురుగుల మందు కవర్ ఖాళీగా కనిపిం చింది. వెంటనే శ్రీనివాస్రాజాను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడిని వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు.
చిలకలపూడి(మచిలీపట్నం): నగరంలోని చల్లరాస్తా సెంటరు సమీపంలో ఓ పండ్ల వ్యాపారిపై స్నేహితుడు కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం జరిగింది. డ్రైవర్స్ కాలనీకి చెందిన వక్కలగడ్డ సాయి, హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పవన్బాబు స్నేహితులు. వారి మధ్య గతంలో జరిగిన వివాదం నేపథ్యంలో శుక్రవారం చల్లరాస్తా సెంటరు సమీపంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ పెద్దదై పవన్బాబుపై వక్కలగడ్డ సాయి పండ్లు కోసే కత్తితో దాడి చేశాడు. పవన్బాబుకు ఛాతీపై తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అతడిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడి సమాచారం అందుకున్న ఇనుకుదురుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు వక్కలగడ్డ సాయిని అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


