ఆసిఫాబాద్అర్బన్: మాదిగలపై వివక్ష చూపుతూ కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలో శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి గాదెవేణి మల్లేశ్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అంబేడ్కర్ చౌక్ నుంచి గాంధీ చౌక్ మీదుగా శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. స్థానిక సీఐ రవికి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్ మాట్లాడారు. మల్లేశ్ ఓ నేతతో ఫోన్లో మాదిగలను కించపరిచేలా మాట్లాడిన తీరు ఓ సామాజిక మాధ్యమంలో వైరలైందని తెలిపారు. మల్లేశ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుని కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు దూడల అశోక్, రాంచందర్, జయరాజ్, రాజలింగు, ఇప్ప నాగరాజు, నరేశ్ తదితరులన్నారు.


