
ఉల్లం‘ఘనుల’పై ఫోకస్
● రాంగ్రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వాహనదారులపై చర్యలు ● మొదటిసారి పట్టుబడితే కౌన్సెలింగ్ ● మళ్లీ అదే తప్పు చేస్తే మాత్రం జైలుకు పంపించేలా కేసులు
సాక్షి, ఆసిఫాబాద్: వాహనదారులకు బిగ్ అలర్ట్.. రాంగ్ రూట్లో వెళ్తున్నారా.. అయితే ఇకపై నేరుగా జైలుకే అని హెచ్చరిస్తున్నారు జిల్లా పోలీసులు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో కఠిన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు రాంగ్ రూట్లో వెళ్లటమే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. రాంగ్ రూట్ వెళ్తూ తొలిసారిగా పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వారితో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే జరిగే నష్టాలను తెలుపుతూ ఉన్న ఫ్లకార్డులను ప్రధాన కూడళ్లలో ప్రదర్శించేలా చిన్నపాటి శిక్షలు సైతం విధిస్తున్నారు. మళ్లీ మళ్లీ తప్పు చేస్తే మాత్రం నేరుగా జైలుకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు.
82 మంది కేసులు నమోదు
జిల్లాలో కఠినమైన ట్రాఫిక్ చట్టాలు ఉన్నా చాలా మంది వాహనదారులు ఉల్లంఘిస్తున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్తో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఆసిఫాబాద్ పట్టణంలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు సబ్డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ చర్యలు చేపట్టారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తూ కొరడా ఝుళిపిస్తున్నారు. అయితే కొందరు వాహనదారులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పోలీసులు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. రాంగ్ రూట్లో వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు పట్టణంలో వంద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 281సెక్షన్ కింద కేసు ఫైల్ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన 82 మందిపై ఆసిఫాబాద్ పట్టణ పోలీసులు 32 కేసులు నమోదు చేశారు. అందులో 77 బైకులు, రెండు ట్రాక్టర్లు, మూడు ఆటోలు ఉన్నాయి.
ఫ్లకార్డులతో ప్రదర్శన...
సోమవారం మధ్యాహ్నం పట్టణం నుంచి ముగ్గురు యువకులు క్లేసాపూర్ పెద్దవాగు బ్రిడ్జిపై రాంగ్ రూట్లో వెళ్తున్నారు. ఆ సమయంలో గోలేటి నుంచి పట్టణంలోకి వస్తున్న ఏఎస్పీ చిత్తరంజన్ వారి వాహనాన్ని ఆపి స్థానిక పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం డ్రైవర్తోపాటు ఉన్న మరో ఇద్దరు యువకులకు రెండు గంటలపాటు పట్టణంలో అంబేడ్కర్ కూడలి వద్ద ఫ్లకార్డులను ప్రదర్శించేలా శిక్ష విధించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే జరిగే నష్టం ఏమిటనే సూక్తులతో ఉన్న ఫ్లకార్డులను వారు సాయంత్రం 6 గంటల నుంచి ప్రదర్శించారు. దీనిపై స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురైనా.. అమ్మో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఇలాంటి కఠిన శిక్షలు పడుతాయా? అంటూ ఆందోళన చెందారు. అలాగే మూడో యువకుడు కనిపించడం లేదని చర్చించుకోవడం గమనార్హం.
స్వచ్ఛందమే.. పనిష్మెంట్ కాదు
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్న వారితో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించాం. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారు తన భద్రత మాత్రమే కాకుండా ఇతర వాహనదారుల భద్రతకు కూడా బాధ్యత వహించాలి. సోమవారం రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన యువకులు స్వచ్ఛందగా ఇకపై తాము ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడమని చెప్పారు. పనిష్మెంట్లా కాకుండా ఇతరులకూ అవగాహన కల్పించేందుకు మాత్రమే ఫ్లకార్డులతో అంబేడ్కర్ కూడలిలో నిలబడ్డారు.
– చిత్తరంజన్, ఏఎస్పీ, ఆసిఫాబాద్ సబ్డివిజన్

ఉల్లం‘ఘనుల’పై ఫోకస్