రైతు బీమాకు రాం.. రాం | - | Sakshi
Sakshi News home page

రైతు బీమాకు రాం.. రాం

Aug 24 2026 12:13 AM | Updated on Aug 24 2026 12:13 AM

ఎనిమిదేళ్ల పథకం రెన్యువల్‌పై నీలినీడలు

ఉమ్మడి జిల్లాలోని 3.10లక్షల మంది రైతుల్లో ఆందోళన

అప్పు తీర్చిన బీమా..

గతంలో మాదిరి కొనసాగించాలి

ప్రభుత్వ ఆదేశాలు రావాల్సి ఉంది

ఖమ్మంవ్యవసాయం: ఆరుగాలం కష్టపడే రైతన్నకు ఆపత్కాలంలో అండగా నిలుస్తున్న ‘రైతు బీమా’ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రీమియం గడువు ముగిసినా పునరుద్ధరణపై ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. ఎవరైనా రైతు సహజంగా లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో 2018లో అప్పటి ప్రభుత్వం ఎల్‌ఐసీ భాగస్వామ్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టగా.. మృతి చెందిన రైతు నామినీ ఖాతాలో పది రోజుల్లోగా రూ.5లక్షల పరిహారం జమ అయ్యేది. గత సంవత్సరం ఆగస్టులో ఒక్కో రైతుకు రూ.3,500 చొప్పున ప్రభుత్వం ప్రీమియం చెల్లించగా ఈనెల 13తో గడువు ముగిసింది. పది రోజులు దాటినా కొనసాగింపుపై స్పష్టత లేకపోవడంతో అయోమయం నెలకొంది. అయితే, ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పేరిట కొత్త విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ఉండడంతోనే రైతు బీమాపై నిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తోంది.

3.10లక్షల మంది అర్హులు

రైతు అకాల మరణంతో కుటుంబ ఆదాయం ఒకసారిగా నిలిచిపోతుంది. పిల్లల చదువు, ఇంటి ఖర్చులు, అప్పుల భారం అన్నీ కుటుంబీకులపై పడతాయి. ఇలాంటి సమయంలో అందే రూ. 5 లక్షల పరిహారం ఊరటగా నిలిచేది. గతేడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.10లక్షల మంది రైతులు బీమాకు అర్హులుగా ఉన్నారు. బీమా పరిధిలోని రైతు మృతి చెందినప్పుడు అవసరమైన ధ్రువపత్రాలను వ్యవసాయ అధికారులకు అందజేస్తే పోర్టల్‌లో నమోదు చేసేవారు. పరిశీలన అనంతరం పరిహారాన్ని బీమా సంస్థ నామినీ ఖాతాలో జమ చేసేది.

12,837 కుటుంబాలకు లబ్ధి

రైతు బీమాలో చేరేందుకు కనీసం గుంట భూమి ఉన్న రైతులు కూడా అర్హులే. 18 – 59 ఏళ్ల వయసు కలిగి పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆధార్‌, నామినీ వివరాలను వ్యవసాయ అధికారులకు సమర్పిస్తే బీమా పరిధిలోకి తీసుకొచ్చేవారు. గత ఏడాది ఆగస్టులో ఒక్కో రైతుకు జీఎస్టీతో కలిపి రూ.3,500 చొప్పున ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించింది. పాలసీ గడువు ఈ నెల 13తో ముగిసినా పొడిగింపుపై స్పష్టత రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో 2018 నుంచి 2025–26 వరకు రైతు బీమా కింద 12,837 క్లెయిమ్‌లు నమోదయ్యాయి. ఇందులో 12,683 క్లెయిమ్‌లను పరిష్కరించి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించారు. మరో 154 రైతు కుటుంబాలకు బీమా అందితే మొత్తంగా రూ.641.85 కోట్ల పరిహారం అందినట్లవుతుంది.

అన్నదాతలకు భరోసానిచ్చే పథకానికి బ్రేక్‌

ఖమ్మం రూరల్‌ మండలం ముత్తగూడెంకు చెందిన ఈ మహిళ పేరు అట్టూరి మరియమ్మ. ఈమె భర్త, వ్యవసాయం చేస్తూ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచే అట్టూరి వెంకన్న అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటికే సాగు పెట్టుబడికి చేసిన రూ.3లక్షల అప్పు ఉంది. అప్పు తీర్చడమే కాక ముగ్గురు పిల్లల పోషణపై ఆందోళనతో ఉన్న మరియమ్మకు బీమా ద్వారా రూ.5 లక్షలు అందాయి. ఈ నగదు అప్పు తీర్చడానికే కాక కటుంబ పోషణకు ఉపయోగపడింది.

అకాల మరణం చెందిన రైతుల కుటుంబానికి బీమాతో అందే రూ.5 లక్షలు ఎంతో ఉపయోగపడేవి. ఈ పథకాన్ని నిలిపేయకుండా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి కొనసాగించాలి. తద్వారా కుటుంబంలో పిల్లల చదువులు, ఖర్చులు, అప్పుల చెల్లింపునకు ఆసరాగా ఉంటుంది.

– సామా మోహన్‌రెడ్డి, మద్దులపల్లి

రైతు బీమా పథకానికి సంబంధించి రెన్యువల్‌, కొత్తగా రైతుల నమోదపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే తదుపరి చర్యలు చేపడతాం. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రక్రియ అమలు చేస్తాం.

– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement