● కలెక్టర్ దివాకర టీ.ఎస్.
ఖమ్మం సహకారనగర్: ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణితో పాటు ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ ఈ సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. మండల కేంద్రాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆయా మండలాల ప్రజలు తమ సమస్యలపై వినతులు, దరఖాస్తులను అక్కడే అధికారులకు అందించాలని సూచించారు. ఈమేరకు దరఖాస్తులను అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.
22న బాల్బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
కల్లూరు రూరల్: ఉమ్మడి జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 22న నిర్వహించనున్నారు. కల్లూరులోని ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో జరిగే పోటీలకు 1–10–2011 తర్వాత జన్మించిన వారు హాజరుకావొచ్చని బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ నాయకులు వేజేల సురేష్, ఉన్నం నాగేశ్వరరావు తెలిపారు. బాలబాలికలు స్టడీ సర్టిఫికెట్ లేక పుట్టిన తేదీ సర్టిఫికెట్తో పాటు ఆధార్కార్డు జిరాక్స్తో హాజరుకావాలని సూచించారు.
కడవెండికి ‘వందేభారత్ జాతీయ సమైక్యత’ అవార్డు
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంకు చెందిన ఎకో క్లబ్ ఎన్విరాన్మెంటల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కడవెండి వేణుగోపాల్కు ‘వందేభారత్ జాతీయ సమైక్యత అవార్డు’ దక్కింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, ఆనందలహరి, వందేభారత్ సినిమా డైరెక్టర్ మల్లం రమేష్ ఆధ్వర్యాన నిర్వహించిన సమావేశంలో ఆయనకు అవార్డు అందించి సత్కరించారు. దేశ సమగ్రత, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ను పలువురు అభినందించారు.


