ఖమ్మం మామిళ్లగూడెం: జిల్లా కేంద్రంలో గురువారం బీజేపీ ఆధ్వర్యాన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సర్దార్ పటేల్ స్టేడియం నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులు జాతీయ జెండాలు చేబూని ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ జాతీయ జెండా కోట్లాది మంది భారతీయుల ఆత్మగౌరవం, దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన సర్దార్ జమలాపురం కేశవరావు తదితరులెందరో ఈ గడ్డపై జన్మించారని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్రెడ్డి, నాయకులు కొండపల్లి శ్రీధర్రెడ్డి, వాకదాని పుల్లారావుయాదవ్, రామలింగేశ్వరరావు, గల్లా సత్యనారాయణ, గోంగూర వెంకటేశ్వరరావు, రుద్ర ప్రదీప్, సన్నె ఉదయ్ప్రతాప్, నున్నా రవికుమార్, డాక్టర్ శీలం పాపారావు, శ్యామ్రాథోడ్, అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


