కారేపల్లి/కామేపల్లి/రఘునాథపాలెం/కొణిజర్ల: దేశంలో బీజేపీ వ్యవహరిస్తున్న విధానాలతో ప్రజాస్వామ్యం ప్రమాదటంచుకు చేరిందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ పేర్కొన్నారు. ఈమేరకు ప్రజాస్వామ్య పరిరక్షణకు మార్పు అత్యవసరమని ఆయన తెలిపారు. పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర సోమవారం కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో సురేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కేంద్రం రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చకపోగామరింత సంక్షోభంలోకి నెట్టిందని, ఎరువుల ధరలు పెంచి భారం మోపిందని తెలిపారు. ఇక రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేయలేకపోయారని విమర్శించారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తూ ఆ పార్టీ నాయకులకే పథకాలు అందిస్తుండగా మిత్ర ధర్మాన్ని ఎక్కడా పాటించడం లేదన్నారు. కాగా, రఘునాథపాలెం మండలం పాపటపల్లి, చిమ్మపుడి గ్రామాల్లో మహ్మద్ రజబ్ అలీ విగ్రహాల వద్ద నాయకులు నివాళులర్పించారు. కాగా, యాత్ర శనివారం రాత్రి కొణిజర్ల మండలంలోకి ప్రవేశించగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు బాగం హేమంతరావు తదితరులు మాట్లాడారు. ఈ యాత్రలో సీపీఐ రాష్ట్ట్ర, జిల్లా నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎర్రా బాబు, ఏపూరి లతాదేవి, స్వర్ణ రమేష్, అజ్మీరా రామ్మూర్తి, రావి శివరామకృష్ణ, ఆనందరావు, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, రాయల రామారావు, అజ్మీరా నరేష్, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, పోటు కళావతి, సింగు నర్సింహారావు, సీతామహాలక్ష్మి, సిద్దినేని కర్ణకుమార్, తాటి నిర్మల, పగడాల మల్లేష్, శాఖమూరి శ్రీనివాసరావు, దొండపాటి రమేష్, ఎం.వెంకటరెడ్డి, గడల భాస్కరరావు, తోటపల్లి సీతారాములుతో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
యాత్రలో సీపీఐ జిల్లా కార్యదర్శి సురేష్


