సత్తుపల్లి టౌన్: సత్తుపల్లిలోని విరాట్ నగర్ కాలనీలో జామాయిల్ చెట్ల తొలగింపు విషయంలో అటవీశాఖ, మున్సిపల్ అధికారుల మధ్య వివాదం నెలకొంది. ఇటీవల ఆ ప్రాంతంలో జామాయిల్ చెట్టు విరిగి ఇంటిపై పడడంతో స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చెట్లు నరికించాలని ఆయన ఆదేశించగా మున్సిపల్ కమిషనర్ కొండ్ర నరసింహ, తహసీల్దార్ సత్యనారాయణ సోమవారం విరాట్నగర్ వెళ్లి ఇళ్లకు ఆనుకుని ప్రమాదకరంగా ఉన్న చెట్లను నరికించేందుకు ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి అటవీ శాఖ సిబ్బంది చేరుకుని అడ్డుకున్నారు. చెట్లు నరికితే కేసులు నమోదు చేస్తామని రేంజర్ ఎల్లయ్య స్పష్టం చేయడంతో కమిషనర్ నరసింహ ‘ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారు... అవసరమైతే తనపై కేసులు నమోదు చేసుకోండి.. చెట్లు మాత్రం నరకాల్సిందే’ అని బదులిచ్చారు. దీనికి తోడు స్థానికులు కూడా చెట్లు నరకాల్సిందేనని పట్టుబట్టగా తహసీల్దార్ సర్దిచెప్పారు. కాగా, ప్రస్తుతం ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించి, ఆ తర్వాత నిబంధనల మేరకు అన్నింటినీ తొలగిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
జామాయిట్ చెట్ల తొలగింపు వేళ వాదన


