రెండు దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి ఆదివాసీలు వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. వీరిలో ఛత్తీస్గఢ్ వాసులే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో 125 వలస ఆదివాసీ పల్లెలు ఉండగా, 23 వేల మంది జనాభా ఉంది. వీరిలో పదో తరగతి, ఇంటర్ చదువుతున్నవారు గ్రామంలో ఒకరిద్దరి కంటే ఎక్కువగా లేరు. ఇప్పుడిప్పుడే ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. వంట గ్యాస్, ద్విచక్ర వాహనాలు, స్మార్ట్ఫోన్లు, ఇళ్లలో డిష్ టీవీల వినియోగాన్ని అలవర్చుకోవడమే కాక పిల్లలను చదివిస్తున్నారు. పాల్వంచ మండలంలోని పలు పల్లెల్లో ఈ మార్పులు కన్పిస్తున్నాయి. రెడ్డిగూడెం ఎస్టీకాలనీకి చెందిన ఇద్దరు యువకులు ఇంటర్, చిరుతానిపాడులో మరో ఇద్దరు యువతులు ఉన్నత విద్య చదువుతుండగా గంగదేవిగుప్పలో ఓ యువకుడు పీజీ చేశాడు.


