ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 86.98 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. జిల్లాలో 95,740 మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినట్లు, 33,134 మంది మరణించినట్లు గుర్తించామని, మరో 42,814 మంది ఓటర్లు మ్యాపింగ్ పూర్తి కాలేదన్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10నాటికి ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ చేయాల్సి ఉండగా, కొత్తగా 19 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుకు ప్రతిపాదించామని చెప్పారు. ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ దివాకర పరిశీలించి భద్రతపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్డీసీ సదానందం, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పరాస్ కుమార్, ఎన్నికల విభాగం ఉద్యోగులు రాజు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర


