ఎనిమిది నెలల ముందే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి
పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్
నిరుద్యోగుల ఆందోళనల్లో
పాల్గొంటున్న బీఆర్ఎస్ నాయకులు
యువతను ఆకట్టుకునేలా
బీజేపీ వ్యూహరచన
ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో...
వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) కొనసాగుతున్నారు. 2023లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో 2024 మే 27న ఉప ఎన్నిక నిర్వహించగా.. బీఆర్ఎస్ అభ్యర్థి ఏ.రాకేష్రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29తో అంటే.. ఇంకో ఎనిమిది నెలల తర్వాత ముగియనుంది.
కాంగ్రెస్ యువమంత్రం
‘జెన్ జీ’ తరం రాజకీయాలను ప్రభావితం చేస్తుండడంతో తలపండిన రాజకీయాలకు మారుపేరైన కాంగ్రెస్ కూడా ఇప్పుడు యువమంత్రం జపిస్తోంది. పట్టభద్రులను ఆకట్టుకోవడం, తద్వారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా పోలీసుతోపాటు అనుబంధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగిన ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి జిల్లాలో నిరసనలు తెలిపారు.
ఆందోళనల్లో బీఆర్ఎస్..
సమకాలీన రాజకీయాలను ఒంటపట్టించుకున్న బీఆర్ఎస్ పార్టీ యువత నిర్వహించే ఆందోళనల్లో భాగస్వామ్యం అవుతోంది. గత ఎన్నికల్లో వరంగల్ – ఖమ్మం – నల్లగొండ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా గెలుపొందాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును రాబట్టేందుకు యువతతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈక్రమాన నిరుద్యోగులు, యువత నిర్వహించే ఆందోళన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నేతలు పాల్గొంటున్నారు. గత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎ.రాకేష్రెడ్డి ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ ఇక్కడి నేతలతో కలిసి సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఆయనే అభ్యర్థి అని ప్రకటించకున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాకేష్రెడ్డి పర్యటనలు సాగుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గురి చూసి కొట్టాల్సిందే..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ స్థానానికి ఎన్నిక ఉంటుందని భావిస్తుండగా పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఢిల్లీలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ ఎన్నికపై చర్చించగా... ఎన్నికల ఇన్చార్జిలుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని నియమించారు. మరోపక్క బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేలా ఇప్పటికే చర్చలు మొదలుపెట్టింది. బీజేపీ సైతం అభ్యర్థి ఎంపికకు కసరత్తు చేస్తున్న క్రమాన ఇద్దరు, ముగ్గురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి.
యువతే లక్ష్యంగా పార్టీల రాజకీయం


