మరోపక్క నేతల కనుసన్నల్లో
ఇసుక అక్రమ రవాణా
ట్రాక్టర్ల కొనుగోలు.. ఒక్కో కూపన్పై రెండు, మూడు ట్రక్కుల తరలింపు
వాహనాల అడ్డగింత
భట్టి ఇలాఖాలో
మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ కేంద్రంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందనే విమర్శలు వస్తున్నాయి. కట్టలేరు, వైరా, మున్నేరు నదులను ఆసరాగా చేసుకుని అక్రమంగా ఇసుక తరలించేందుకు కొందరు కాంగ్రెస్ నాయకులు ఏకంగా ట్రాక్టర్లు కొనుగోలు చేయడం గమనార్హం. ఇసుక తరలింపునకు ఒక కూపన్ తీసుకొని రెండు, మూడేసి ట్రక్కులు బహిరంగంగానే తరలిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ట్రాక్టర్ల అనుమతులు, కూపన్లను తనిఖీ చేయాల్సిన అధికారులు.. అధికార పార్టీ నేతల విషయంలో మిన్నకుండి పోతున్నారని సమాచారం. ఇంకొన్ని చోట్ల స్థానిక ఉద్యోగులు అవినీతిలో భాగం పంచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పలువురు కాంగ్రెస్ నాయకులే ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది.
రాత్రయితే సైలెంట్
మధిర మండలంలో చిలుకూరు, నక్కలగరుబు, రాయపట్నంల్లో ప్రభుత్వం అధికారికంగా రీచ్లకు అనుమతి ఇచ్చింది. ఇక్కడ నుంచి నిబంధనల మేరకు కూపన్ల ఆధారంగా ఇసుక తరలించాల్సి ఉంటుంది. కానీ కొద్ది నెలల పాటు పరిమితి మించి, అనుమతి లేకుండా ఇసుక తరలించగా.. ఇటీవల ఉన్నతాధికారులు తనిఖీలు ముమ్మరం చేయగా రాత్రిపూట తోలకాలు నిలిపివేశారు. మధ్యాహ్నం మాత్రం తమకెవరూ అడ్డు లేరన్నట్లుగా.. ఒక కూపన్ ఆధారంగా రెండు, మూడేసి ట్రక్కుల ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీసు ఉద్యోగులు కొందరు ‘మామూలు’గా తీసుకుంటూ ఇందుకు కారణమైన ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకుల జోలికి వెళ్లడంలేదని తెలుస్తోంది. ఇసుక కూపన్ల తనిఖీ కోసం పోలీసు శాఖ ఆధ్వర్యాన సిరిపురం క్రాస్ వద్ద చెక్పోస్ట్ ఏర్పాటుచేసినా పరిశీలన అంతంత మాత్రంగానే సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
వైరా నదిలో తవ్వకాలతో భారీగా గుంతలు
వైరా నదిలో రిటైనింగ్ వాల్ కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయినర్తో మట్టి తవ్వి తరలిస్తుండగా సీపీఎం నాయకులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శీలం నరసింహారావు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా భారీ గుంతలు తవ్వుతుండడంతో రాయపట్నం బ్రిడ్జికి ప్రమాదం ఎదురవుతుందని చెప్పారు. ఈవిషయం తెలిసి టౌన్ ఎస్ఐ కిషోర్ చేరుకుని తవ్వకాలను నిలిపివేయించారు. నాయకులు పడకంటి మురళి, పాపినేని రావనర్సయ్య, రాధాకృష్ణ పాల్గొన్నారు.


